KTR – ACB Enquiry: ఫార్ముల ఈ కార్ రేసు కేసు.. నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్!

ACB Enquiry’s KTR on Formula E Car Race: ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని ఏసీబీ ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ ను విచారించారు. తాజాగా మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఫార్ములా ఈ- ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు ఎంక్వైరీ చేశారు. అయితే గత మే 28నే ఏసీబీ విచారణకు రావాలని కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. కానీ తాను అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉందని.. తిరిగి వచ్చాక విచారణకు వస్తానని చెప్పారు. తాజాగా కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ రావడంతో ఇవాళ విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది.
కాగా కేసుకు సంబంధించి విచారణలో నిధుల మళ్లింపు, కేబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం, సచివాలయ బిజినెస్ రూల్స్ ఉల్లంఘనకు సంబంధించి ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం. అలాగే కేటీఆర్ విచారణ పూర్తైన తర్వాత కేసులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈరోజు ఉదయం 10 గంటలకు ఆయన ఏసీబీ ముందుకు వెళ్లనున్నారు. ముందుగా తెలంగాణ భవన్ కు వెళ్లి.. అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులతో ఏసీబీ కార్యాలయానికి వెళ్లాలని నిర్ణయించినట్టు టాక్. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లుచేశారు.