Harish Rao Falls Sick: హరీశ్ రావుకు అస్వస్థత.. ఆస్పత్రిలో పరామర్శించిన కేటీఆర్!
BRS Leader Harish Rao Falls Sick: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు నిన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హరీశ్ రావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఫార్ములా వన్ ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ ను నిన్న ఏసీబీ విచారించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హరీశ్ రావు కేటీఆర్ వెంటే ఉన్నారు. విచారణ అనంతరం కేటీఆర్ రాత్రి తెలంగాణ భవన్ కు రాగా.. అక్కడ ఆయనతో మాట్లాడిన హరీశ్ రావు అస్వస్థతకు గురయ్యారు.
ఉదయం నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న హరీశ్ రావు డీహైడ్రేషన్ కారణంగా వైరల్ ఫీవర్ తో బాధపడుతుండటంతో డాక్టర్లు ఆస్పత్రిలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ ఆస్పత్రికి వెళ్లిన కేటీఆర్.. హరీశ్ రావును పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హరీశ్ రావుకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. మరోవైపు హరీశ్ రావు అస్వస్థతకు గురికావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు.