Harish Rao : ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడినవన్నీ అబద్ధాలే : మాజీ మంత్రి హరీశ్రావు

Former Minister Harish Rao : కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ సంస్థ ఇచ్చిన నివేదికపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడినవన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. మేడిగడ్డలో అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభపై చర్చ జరుగుతుందనే అక్కసుతో ఉత్తమ్ అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్డీఎస్ఏ సంస్థ ఎన్డీయే ప్రభుత్వ జేబు సంస్థగా మారిందని ఆరోపించారు.
జాతీయ డ్యామ్ సేఫ్టీ చట్టాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్..
కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదికపై మంత్రి ఉత్తమ్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై హరీశ్రావు ఇవాళ స్పందించారు. పలువురు నేతలతో కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించిందని ఆరోపించారు. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతలకు డీపీఆర్ ఉందా? అని ప్రశ్నించారు. డీపీఆర్ లేకుండానే కొడంగల్ ఎత్తిపోతల పనులు ప్రారంభించారని ఫైర్ అయ్యారు. పోలవరంలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతే ఎన్డీఎస్ఏ ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. పోలవరానికి ఎందుకు పోలేదు? ఎందుకు నివేదిక ఇవ్వలేదు? అని మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ అనేది ఎన్డీయే ప్రభుత్వ జేబు సంస్థగా మారిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.