CM Revanth Reddy : కేసును కొట్టేయండి.. తెలంగాణ హైకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిటిషన్

CM Revanth Reddy petition in the High Court : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైకోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో కేసు ఉన్న నేపథ్యంలో దానిని కొట్టివేయాలని పిటిషన్లో కోరారు. గతేడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో రేవంత్ చేసిన ప్రసంగంపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం దావా వేశారు. బీజేపీకి పరువు నష్టం కలిగేలా సీఎం రేవంత్ మాట్లాడారంటూ ఫిర్యాదు చేశారు. కాసం పిటిషన్ను విచారణకు స్వీకరించిన ప్రజాప్రతినిధుల కోర్టు విచారణలో భాగంగా సాక్షుల వాంగ్మూలం నమోదు చేసింది.
కమలం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో మాట్లాడారని కాసం తన పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్పై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రసంగం ఆడియో, వీడియో క్లిప్పింగ్లను కాసం కోర్టుకు సమర్పించారు. దీంతో విచారణలో ఉన్న కేసును కొట్టేయాలని రేవంత్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ చేపట్టొద్దని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.