Road Accident in Palnadu: పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

Massive Road Accident at Palnadu District Andhra Pradesh: పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. వినుకొండ మండల పరిధిలోని శివాపురం గ్రామ శివారులో మినీ ట్రక్కును ఎదురుగా వచ్చిన లారీ అతివేగంతో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మినీ ట్రక్కులో ఉన్న ఐదుగురు తీవ్ర గాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో కొంతమందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుత్రికి తరలించారు.
అయితే ప్రమాదం జరిగిన తర్వాత స్పాట్ లోనే ముగ్గురు చనిపోయారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తీసుకెళ్తుండా మరో ఇద్దరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతులు ప్రకాశం జిల్లాలోని యర్రగొంపాలెం మండలం గడ్డమీదపల్లికి చెందిన వారుగా గుర్తించారు. వీరంతా వ్యవసాయ కూలీలని చెప్పారు. బొప్పాయి కాయల లోడుతో వెళ్తున్న ఈ బొలెరోను లారీ ఢీకొట్టింది.
పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని నారా లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చనిపోవడం విచారకరమని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు.
అలాగే, ఈ ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని మంత్రి అన్నారు.