Pawan Kalyan: టీడీపీ జాతీయాధ్యక్షుడిగా చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ట్వీట్

Chandrababu: కడప వేదికగా రెండు రోజులుగా టీడీపీ మహానాడు వైభవంగా జరుగుతోంది. కాగా మహానాడులో రెండో రోజు నిన్న టీడీపీ జాతీయాధ్యక్షుడిగా చంద్రబాబును ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు సంకల్పంతో అవిర్భవించిన తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబు నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, నాలుగు దశాబ్దాలుగా నిరంతరం ప్రజా బాహుళ్యంలో ఉందని ప్రశంసించారు. మీకు అన్ని విధాలా విజయం కలగాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
“స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సంకల్పంతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి ప్రగతిశీల నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, నాలుగు దశాబ్దాలుగా నిరంతరం ప్రజా బాహుళ్యంలో ఉంది. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత టీడీపీ ఘనంగా నిర్వహించుకుంటున్న ఈ తొలి మహానాడు సందర్భంగా 12వ సారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రబాబు గారికి హృదయపూర్వక అభినందనలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా హైదరాబాద్ ను సైబరాబాద్ గా మార్చి.. ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, డెల్ వంటి గ్లోబల్ ఐటీ దిగ్గజాలను ఆకర్షించారు. 1999లో ఆంధ్రప్రదేశ్ విజన్ 2020 పత్రాన్ని రూపొందించి, ఆర్థిక సంస్కరణలు మరియు సాంకేతికత ఆధారిత అభివృద్ధి వైపు పయనింపచేశారు. ఆయన అపారమైన అనుభవ సంపత్తి, దూరదృష్టితో కూడిన నాయకత్వం, ప్రజాసేవ పట్ల అచంచలమైన నిబద్ధత ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి మార్గదర్శకంగా మారుతుంది. దేశాభివృద్ధికి మీరు మరింత కృషి చేయాలనే ఆకాంక్షతో, ఈ నూతన బాధ్యతల్లో మీకు అన్ని విధాలా విజయం కలగాలని కోరుకుంటున్నాను. ఈ శుభ సందర్బంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.