Iran : అణు ఒప్పందంపై అమెరికాతో చర్చించే ప్రసక్తే లేదు : ఇరాన్ కీలక ప్రకటన

Iran vs USA : తమపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికాతో ఎలాంటి అణు ఒప్పంద చర్చలు జరిపేది లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. అణు ఒప్పందంపై ఇరాన్ చర్చలకు రాని పక్షంలో రెండు వారాల్లో దాడులపై నిర్ణయం తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పందించారు. అణు ఒప్పందానికి సంబంధించి అమెరికా చర్చలకు రావాలని పేర్కొన్నారు. తాము వాటిని తిరస్కరిస్తున్నామని చెప్పారు. ట్రంప్ చేస్తున్న ఇజ్రాయెల్ అనుకూల వ్యాఖ్యలు చూస్తే, దాడుల్లో అమెరికా ప్రమేయం ఉందని స్పష్టమవుతోందన్నారు. ఉద్రిక్తతలను తగ్గించాలని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు పిలుపునిచ్చారని తెలిపారు. తాము ఆత్మరక్షణ కోసం పోరాడుతున్నామని, ఇది ఆగదని అరాఘ్చీ తెలిపారు.
ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో అణు స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. పరస్పర దాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరాన్పై సైనిక చర్యకు అమెరికా సిద్ధమవుతున్నట్లు ఇటీవల కథనాలు వెలువడ్డాయి. దీనిపై వైట్హౌస్ స్పందించింది. ట్రంప్ విషయంలో రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. టెహ్రాన్తో దౌత్యపరమైన పరిష్కారానికే అధ్యక్షుడు సిద్ధంగా ఉన్నారని తెలిపింది.