DEECET- 2025: డీఈఈసెట్- 2025 ఫలితాలు విడుదల.. ఈనెల 9 నుంచి కౌన్సెలింగ్
DEECET Results Released: తెలంగాణలో డీఈఈసెట్- 2025 ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో 2025-28 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు గాను మే 25న ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించారు. కాగా పరీక్షలో మొత్తం 78.18 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 48,815 మంది విద్యార్థులు డీఈఈసెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 33,321 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అందులో 28,442 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
కాగా తెలుగు మీడియంలో 77 మార్కులతో తక్కళ్లపల్లి హరిత స్టేట్ టాపర్ గా నిలిచారు. ఇంగ్లీష్ మీడియంలో 87 మార్కులతో పసునూరి అభినవ రెడ్డి, ఉర్దూ మీడియంలో 67 మార్కులతో ఫరాజ్ అహ్మద్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. కాగా డీఈఐఈడీ, డీపీఎస్ఈ కోర్సుల్లోని సీట్ల భర్తీ కౌన్సెలింగ్ ఈనెల 9 నుంచి ప్రారంభం కానుంది. జూన్ 13 వరకు రాష్ట్రంలోని 10 డైట్ కాలేజీల్లో అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఈ నెల 14 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50కి పైగా డైట్ కాలేజీల్లో 4 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.