Last Updated:

RCB vs MI : గ్రాండ్ బోణి కొట్టిన బెంగుళూరు.. ముంబై బౌలర్స్ ని ఉతికారేసిన డుప్లెసిస్‌,కోహ్లీ

ఏ సాలా కప్ నందే.. ఐపీఎల్‌ 16వ సీజన్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు సూపర్ విక్టరీ తో ప్రారంభించి అభిమానులందరికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది.  బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌ ని చిత్తుగా ఓడించింది.  172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే చేధించి మంచి బోణి కొట్టారు.

RCB vs MI : గ్రాండ్ బోణి కొట్టిన బెంగుళూరు.. ముంబై బౌలర్స్ ని ఉతికారేసిన డుప్లెసిస్‌,కోహ్లీ

RCB vs MI : ఏ సాలా కప్ నందే.. ఐపీఎల్‌ 16వ సీజన్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు సూపర్ విక్టరీ తో ప్రారంభించి అభిమానులందరికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది.  బెంగళూరు లోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌ ని చిత్తుగా ఓడించింది.  172 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే చేధించి మంచి బోణి కొట్టారు. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన బెంగుళూరుని విరాట్ కోహ్లీ, ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో చెలరేగి విజయ తీరాలకు చేర్చారు.

172 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బెంగుళూరు టీమ్.. ఆరంభం నుంచే స్కోర్ బోర్డుని పరుగులు పెట్టిస్తూ చెలరేగారు. ముఖ్యంగా కోహ్లీ 49 బంతుల్లో 82 పరగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. డూప్లెసిస్ 43 బంతుల్లో 73 పరుగులు చేశాడు. వీరిద్దరూ ముంబై బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. తొలి వికెట్ కు 148 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు. ఆఖర్లో డుప్లెసిస్‌, కార్తీక్‌ ఔటౌనప్పటికీ కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌ మిగతా పనిని పూర్తి చేశారు. దీంతో ఆర్బీసీ 16.2 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి టార్గెట్ ను చేజ్ చేసింది. ముంబై బౌలర్లలో అర్షద్‌ ఖాన్‌, కామెరూన్‌ గ్రీన్‌ తలా ఓ వికెట్‌ తీశారు. ఓ సూపర్బ్‌ క్యాచ్‌తో పాటు కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో బెంగళూరును గెలిపించిన డుప్లెసిస్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

 

 

ముంబై జట్టు బౌలర్లు ఈ మ్యాచ్ లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. కోహ్లీ 7 పరుగుల వద్ద ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను అర్చర్‌ వదిలిపెట్టేశాడు. దీనికి ముంబై భారీ మూల్యమే చెల్లించింది. మరోవైపు డుప్లెసిస్‌ కూడా కోహ్లీకి జత అవ్వడంతో ఇలా ఒకరికొకరు పోటీ పడి ఫోర్లు, సిక్సర్లు బాదడంతో పవర్‌ప్లే అయ్యేసరికి 53 పరుగులు చేసిన ఆర్సీబీ.. 11వ ఓవర్లోనే వంద దాటేసింది. డుప్లెసిస్‌ 29 బంతుల్లో, కోహ్లి 38 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు.

కాగా అంతకు ముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ముంబయిని తిలక్‌ వర్మ (84 నాటౌట్‌; 46 బంతుల్లో 9×4, 4×6) సూపర్బ్‌ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. అయితే తిలక్‌ వర్మ ఒంటరి పోరాటానికి ఇతర బ్యాట్స్ మెన్లు సహకారం అందించలేకపోయారు. తిలక్ వర్మ స్కోరులో 9 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి హర్షల్ పటేల్ బౌలింగ్ లో తిలక్ వర్మ హెలికాప్టర్ షాట్ తో సిక్స్ కొట్టిన విధానం హైలైట్. 13 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో హర్షల్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కామెరూన్ గ్రీన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్ సింగిల్ డిజిట్ స్కోరలకే పెవిలియన్ బాట పట్టారు. దీంతో ముంబై ఈ ఓటమి భారాన్ని మోయక తప్పలేదు. ముంబై బ్యాట్స్ మెన్ లతో పాటు బౌలర్లు కూడా ఈ మ్యాచ్ లో  చేతులెత్తేశారా అనే డౌట్ మాత్రం అందరికీ కలుగుతుంది. దీంతో 11 సీజన్ లలో మొదటి మ్యాచ్ ఓడిపోయిన జట్టుగా ముంబై నిలిచింది.