Sonia, Rahul Gandhi : నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్పై ఈడీ సంచలన ఆరోపణ

National Herald Case : నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, లోక్సభలో పతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. సోనియా, రాహుల్ రూ.142 కోట్లు లబ్ధి పొందారని ఆరోపించింది. బుధవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈడీ వాదనలు వినిపించింది.
గతంలో పలుమార్లు విచారణ..
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలతో సోనియా గాంధీ, రాహుల్ను ఈడీ అధికారులు గతంలో పలుమార్లు విచారించారు. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదులు రావటంతో ఈడీ, సీబీఐ దర్యాప్తు చేశాయి. సీబీఐ విచారణ మధ్యలోనే నిలిచిపోయింది. అయినప్పటికీ ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. కేసులో 2023 నవంబరులో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనం కోసం చర్యలు ప్రారంభించింది.
ఇందులో భాగంగా నోటీసులు జారీ చేసింది. ఆయా ఆస్తుల్లో ఉన్నవారు వెంటనే ఖాళీ చేయాలని పేర్కొంది. అద్దెకు ఉంటున్నవారు ఇక నుంచి తమకే ఆ మొత్తం చెల్లించాలని తెలిపింది. అక్రమ చెలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ (8) నిబంధన 5(1) ప్రకారం జప్తు చేసిన ఆస్తులు స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేస్తున్నామని తెలిపింది. ఆస్తులు ఉన్న ప్రాంతాల్లో ఢిల్లీ, ముంబయి, లఖ్నవూ భవనాలకు నోటీసులు అంటించినట్లు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. సోనియా గాంధీ, రాహుల్ సహా పలువురి పేర్లను పేర్కొంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లయింట్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిగింది.