Delhi : ఢిల్లీ ఎయిర్పోర్టులో ఈ నెల 15 నుంచి రోజుకు 114 దేశీయ విమాన సర్వీసులు రద్దు

Delhi International Airport Limited : ఢిల్లీలో ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు ప్రతిరోజూ 114 దేశీయ విమాన సర్వీసుల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్ ప్రకటించింది. ఢిల్లీ విమానాశ్రయ రన్ వే ఆధునికీకరణలో భాగంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. మరో 86 విమానాలను తిరిగి రీషెడ్యూల్ చేయనున్నట్లు తెలిపారు. వాటాదారులతో విస్తృత చర్చలు జరిపిన తర్వాత నిర్ణయానికి వచ్చినట్లు డయల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విదేహ్ కుమార్ జైపురియార్ పేర్కొన్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నాలుగు రన్వేలు ఉన్నాయి. ప్రయాణికుల కోసం రోజుకు 1,450 విమాన సర్వీసులు ఉంటాయి. తాజాగా పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు..
విమానాల రద్దు వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా సాధారణ సమయాల్లో విమానాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు జైపురియార్ తెలిపారు. ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు రోజుకూ 33 నుంచి 25 సర్వీసులను రద్దు చేసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు వివరించారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో విమాన సర్వీసుల రద్దు వల్ల దేశంలోని పలు ప్రధాన విమానాశ్రయాలోని విమానాలపై స్వల్ప ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ముంబయి విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు 56 నుంచి 54కు తగ్గుతాయని పేర్కొన్నారు. కోల్కతాలో 22 నుంచి 21 విమానాలు తగ్గుతాయని తెలిపారు. అహ్మదాబాద్లో 21 నుంచి 19 విమానాలు, బెంగళూరులో 38 నుంచి 36 విమానాలు తగ్గుతాయన్నారు. చెన్నైలో 20 నుంచి 19 విమానాలు, పట్నాలో 13 నుంచి 12 ఫ్లైట్స్ తగ్గుతాయని అధికారులు వివరించారు.