Eknath Shinde : మహారాష్ట్ర డిప్యూటీ సీఎంకు చేదు అనుభవం.. విమానం నడపడానికి పైలట్ నిరాకరణ

Maharashtra : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందేకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన విమానం గంటపాటు ఆలస్యమైంది. పైలట్ విమానం నడిపేందుకు నిరాకరించడమే ఇందుకు కారణం. ముఖ్యమంత్రి పర్యటన ఆలస్యం కావడం వల్ల పైలట్ విమానాన్ని నడిపేందుకు అంగీకరించలేదని తెలుస్తోంది.
డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందే, మంత్రి గిరీశ్ మహాజన్, గులాబ్రావ్ పాటిల్ జలగావ్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. పర్యటనకు ఆయన రెండున్నర గంటలు ఆలస్యంగా వచ్చారు. అనంతరం తిరిగి ముంబయికి వెళ్లేందుకు అక్కడి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. తన పని గంటలు ముగిశాయని చెప్పి పైలట్ విమానం నడిపేందుకు నిరాకరించాడు. దీంతో మంత్రులు విమాన సంస్థ ప్రతినిధులతో మాట్లాడి 45 నిమిషాలు అతడిని ఒప్పించేందుకు ప్రయత్నించారు. తర్వాత పైలట్ అంగీకరించడంతో విమానం ముంబయికి బయలుదేరింది. పైలట్కు ఆరోగ్యం సరిగా లేనందువల్ల ఇలా జరిగిందని గిరీశ్ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కిడ్నీ బాధితురాలికి లిఫ్ట్ ఇచ్చిన శిందే..
కిడ్నీ శస్త్రచికిత్స కోసం మంబయికి వెళ్తున్న ఓ మహిళకు శిందే లిఫ్ట్ ఇచ్చారు. శీతల్ పాటిల్ అనే మహిళ తన భర్తతో కలిసి ముంబయికి ప్రయాణించాల్సి ఉంది. వారు ఎక్కాల్సిన విమానం అప్పటికే వెళ్లిపోయింది. ఈ క్రమంలో శిందేకు వారి గురించి తెలిసిన వెంటనే లిఫ్ట్ ఇచ్చారు. వారి కోసం ముంబయి ఎయిర్పోర్టులో అంబులెన్స్ను సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీంతో వారు డిప్యూటీ సీఎం శిందేకు కృతజ్ఞతలు తెలిపారు.