Published On:

DK Shivakumar Comments: నటి రన్యారావుకు హోంమంత్రి కానుక.. అందులో తప్పేముంది..?: డీకే శివకుమార్

DK Shivakumar Comments: నటి రన్యారావుకు హోంమంత్రి కానుక.. అందులో తప్పేముంది..?: డీకే శివకుమార్

DK Shivakumar visits Home Minister G. Parameshwara’s house: కన్నడ నటి రన్యారావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలపై ఈడీ దాడులు జరిగిన సంగతి విధితమే. పరిణామాలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రన్యారావు, మంత్రి పరమేశ్వర సంస్థ మధ్య ఆర్థిక లావాదేవీలపై డీకే మాట్లాడారు. నటి రన్యారావుకి మంత్రి పెళ్లి కానుక ఇచ్చారని, అందులో తప్పేముందని ప్రశ్నించారు.

 

ఈడీ దాడులు..

గోల్డ్ అక్రమ రవాణా కేసుకు సంబంధించి శ్రీసిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధ, గురు వారాలు రెండు రోజులు దాడులు చేసింది. ఈ కళాశాలకు హోంమంత్రి పరమేశ్వర చైర్మన్‌గా ఉన్నారు. గోల్డ్‌ స్మగ్లింగ్‌ నటి కేసులో రన్యారావు, కళాశాలకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలో గురువారం హోంమంత్రి నివాసానికి డీకే శివకుమార్‌ వెళ్లారు.

 

గిఫ్ట్‌ ఇవ్వడం సహజమే..

అనంతరం డీకే మీడియాతో మాట్లాడారు. ఇప్పుడే పరమేశ్వరను కలిసినట్లు తెలిపారు. తాము ప్రజాజీవితంలో ఉన్నామని, కొన్ని సంస్థలనూ నడుపుతున్నామని చెప్పారు. సాధారణంగా తాము ఎంతోమందిని కలుస్తుంటామని చెప్పుకొచ్చారు. వారు ఏం చేస్తున్నారో తమకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఇక, పెళ్లి వేడుకలకు వెళ్లినప్పుడు డబ్బులు ఇస్తుంటామని వివరించారు. ఇక్కడ తాను చట్టం, ఈడీ సోదాల్లో జోక్యం చేసుకోవడం లేదన్నారు. ఏం జరిగిందో వాస్తవం తెలుసుకునేందుకే హోంమంత్రి ఇంటికి వచ్చినట్లు చెప్పారు. వివాహ సమయంలో నటికి గిఫ్ట్‌గా ఇచ్చానని మంత్రి తెలిపారు. అది సహజమేనన్నారు. అందులో ఎలాంటి తప్పు లేదని డీకే వ్యాఖ్యానించారు. నటి రన్యారావు నేర చర్యలను ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా సమర్థించడం లేదని ఆయన స్పష్టం చేశారు.

 

దర్యాప్తునకు సహకరిస్తా : హోంమంత్రి

డీకే శివకుమార్ వ్యాఖ్యలపై హోంమంత్రి పరమేశ్వరను సంప్రదించగా, ఆ విషయం శివకుమార్‌నే అడగండని దాటవేశాడు. తాను దర్యాప్తునకు సహకరిస్తానని వెల్లడించారు. నటి రన్యారావు స్మగ్లింగ్‌ కేసులో రాజకీయ నేతల హస్తం ఉందనే అనుమానంతో ఇటీవల జరిగిన ఆమె పెళ్లికి హాజరైన వ్యక్తులపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్న సంగతి తెలిసిందే. నటి వివాహానికి హాజరైన అతిథులు, వారు ఇచ్చిన కానుకలపై విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పెళ్లి వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంశాఖ మంత్రి జి.పరమేశ్వర హాజరైనట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో హోంమంత్రితో సంబంధం ఉన్న కళాశాలపై ఈడీ దాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం..

దుబాయ్‌ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ కన్నడ నటి రన్యారావు కొన్నిరోజుల కింద బెంగళూరు ఎయిర్ పోర్టులో దొరికిపోయిన విషయం తెలిసిందే. నటి నుంచి 14.7 కిలోల గోల్డ్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కొంతమంది ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చాయి. కేసులో నటికి ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ కాఫిఫోసా చట్టం కింద నమోదైన కేసులో ఊరట దక్కలేదు.

ఇవి కూడా చదవండి: