Karregutta: కర్రెగుట్టలో కూంబింగ్.. ల్యాండ్ మైన్ పేలి ఇద్దరు జవాన్లు మృతి

Karregutta: ములుగు జిల్లా కర్రెగుట్టల్లో ల్యాండ్ మైన్కు పోలీసులు బలి అయ్యారు. మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైన్ పేలి ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. STFకి చెందిన మరో ఇద్దరి జవాన్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను బీజాపూర్ తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్రెగుట్ట కింది భాగంలో మావోయిస్టులు భారీగా ల్యాండ్ మైన్లు అమర్చారు. పోలీసులు కూంబింగ్ చేస్తుండగా ల్యాండ్ మైన్లు పేలడంతో ఈ దారుణం జరిగింది.
బీజాపూర్ జిల్లాలోని లంకపల్లి అటవీ ప్రాంతంలో, ములుగు జిల్లా వీరభద్రవరం అటవీ ప్రాంతంలో ల్యాండ్ మైన్లు పేలాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ జవాన్లు చనిపోగా.. ఇద్దరు తెలంగాణ స్పెషల్ పార్టీ జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. కూంబింగ్ నిర్వహిస్తుండగా ల్యాండ్ మైన్ పేలింది. ఈ ఘటనపై అధికారికంగా పోలీసులు ధృవీకరించలేదు.
భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ 17వ రోజుకు చేరుకుంది. భద్రతా బలగాల మెరుపు దాడులతో కర్రెగుట్టలు ఎర్రబారుతున్నాయి. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 22మంది మావోయిస్టులు చనిపోయారు. ఇప్పటివరకు 18 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్కౌంటర్ జరిపారు. డ్రోన్ కెమెరా ద్వారా మావోయిస్టుల కదలికలు పసిగట్టి ఎటాక్ చేశారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
తెలంగాణలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది. దీంతో ఎస్పీ శబరీష్ ఎదుట ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో దళసభ్యులు పనిచేస్తున్నారు. లొంగిపోయిన వారిని జనజీవన స్రవంతిలోకి జిల్లా ఎస్పీ ఆహ్వానించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 47మంది మావోయిస్టులు లొంగిపోయారని ఎస్పీ తెలిపారు.