LRS: ఎల్ఆర్ఎస్పై కీలక ప్రకటన.. మరో మూడు రోజులు పొడిగింపు

TG Government Extended LRS 3 days up to May 3: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. కాంగ్రెస్ సర్కార్ ఎల్ఆర్ఎస్పై కీలక ప్రకటన చేసింది. ఎల్ఆర్ఎస్ గడువును మరో మూడు రోజులపాటు పొడిగించింది. ఇందులో భాగంగానే పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ కార్యదర్శి పీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అనధికార స్థలాల క్రమబద్దీకరణను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం 25శాతం రాయితీతో ఓటీఎస్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువు ఏప్రిల్ చివరికి ముగిస్తుండగా.. ఈ గడువును మరో మూడు రోజులు పెంచింది.
అయితే అంతకుముందు ప్రభుత్వం ఏప్రిల్ 30వరకు గడువు ఇవ్వగా .. ఇంకా సుమారు 20 లక్షల మంది ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇందులో నిన్నటివరకు కేవలం 6 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించేందుకు ఆసక్తి కనబర్చారు. ఇందులో భాగంగానే మరో నెల రోజుల పాటు గడువు పెంచాలని పురపాలక శాఖ అధికారులు ప్రతిపాదించగా.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత మే 15 వరకు గడువు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఆ తర్వాత కేవలం 3 రోజులు మాత్రమే అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పురపాలక శాఖ అధికారులు కనీసం నెల రోజులు పెంచితే బాగుంటుందని కోరుతున్నారు.
ఇక, ఈ విషయంపై ప్రభుత్వం ఈ మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎల్ఆర్ఎస్లో రాష్ట్ర ఖజానాకు ఇప్పటి వరకు రూ.1,890 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో సీడీఎంఏ పరిధిలోని మునిసిపాలిటీల నుంచి రూ.1,229 కోట్లు.. గ్రామ పంచాయతీల నుంచి రూ.193 కోట్లు, అర్బన్ డెవల్పమెంట్ అథారిటీల నుంచి రూ.64 కోట్లు, జీహెచ్ఎంసీ నుంచి రూ.170, హెచ్ఎండీఏ నుంచి రూ.234 కోట్లు వసూలైంది. సీడీఎంఏ పరిధిలో అత్యధిక ఆదాయం రాగా.. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ఆశించిన మేర ఆదాయం రాలేదు. అంతకుముందు మార్చి నుంచి అమలులో ఉన్న ఎల్ఆర్ఎస్ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.