Published On:

Kunamneni Sambasiva Rao: ‘కాళేశ్వరం’ పనికి రాదు.. కూనంనేని కీలక వ్యాఖ్యలు..!

Kunamneni Sambasiva Rao: ‘కాళేశ్వరం’ పనికి రాదు.. కూనంనేని కీలక వ్యాఖ్యలు..!

CPI State Secretary and MLA Kunamneni Sambasiva Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం పనికిరాదని, ప్రాజెక్టును రద్దు చేయాలన్నారు. హనుమకొండ జిల్లా పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొమ్మును కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని కోరారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాళేశ్వరం అంటే కేసీఆర్ అన్నోళ్లు నోరు మూసుకున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అన్నీ తానే అన్నట్టుగా వ్యవహరించారని, ఇప్పుడు తనకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఒక్క చుక్కనీరు అదనంగా ఇవ్వలేదని ఆరోపించారు. పంటలకు వస్తున్న నీళ్లు ఎల్లంపల్లి నీళ్లే అన్నారు. 140 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలని సీపీఐ డిమాండ్ చేసిందని గుర్తుచేశారు. కానీ, మహారాష్ట్ర అనుమతి ఇవ్వలేదని హరీశ్‌రావు అంటున్నారని తెలిపారు.

 

కేంద్రం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన నంబాల కేశవరావు మృతదేహాన్ని కుటుంబానికి అప్పజెప్పకపోవడం దారుణమన్నారు. కమ్యూనిస్టుల మృతదేహాలను చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతుందన్నారు. కృత్రిమంగా పేదలు లేని దేశంగా చూపాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. నెలకు రూ.8 ఆదాయం ఉంటే ధనికుడవుతారా? ఇదొక దగా అన్నారు. నెలకు రూ.20వేల ఆదాయం ఉన్న కూడా పేదవారిగానే పరిగణించాలన్నారు. అగ్రరాజ్యం అమెరికా చెప్పు చేతల్లో ప్రధాని మోడీ పని చేస్తున్నారని ఆరోపించారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో మోడీ ఇజ్రాయెల్‌కు మద్దతు చేస్తున్నారన్నారు. భారతదేశ విదేశాంగ విధానం మారాల్సిన అవసరం ఉందన్నారు.

 

తెలంగాణలో పెద్దలకు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. చిన్నవాళ్లకు బిల్లులు చెల్లించడం లేదన్నారు. చిన్నవాళ్లకు బిల్లులు చెల్లించి వాళ్లను కాపాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బిల్లులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

 

ఇవి కూడా చదవండి: