Published On:

CM Revanth Reddy : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే మా లక్ష్యం : సీఎం రేవంత్‌‌రెడ్డి

CM Revanth Reddy : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే మా లక్ష్యం : సీఎం రేవంత్‌‌రెడ్డి

CM Revanth Reddy Review On Education Department : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం విద్యాశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాని చెప్పారు. ఇందుకు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులు, ఉపాధ్యాయుల‌కు శిక్ష‌ణ‌, ఇత‌ర స‌దుపాయాలు కల్పిస్తామని స్ప‌ష్టం చేశారు. తెలంగాణలో 20 మంది కన్నా ఎక్కువ పిల్ల‌లు ఉన్న గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఈ ఏడాది కొత్తగా 571 పాఠ‌శాల‌లు ప్రారంభిస్తున్నామని తెలిపారు.

 

విద్యార్థులకు భాషా ప‌రిజ్ఞానంతోపాటు నైపుణ్యాల పెంపున‌కు వీలుగా విద్యావ్య‌వ‌స్థ‌ను మార్పు చేయాల‌ని సూచించారు. హైస్కూల్ స్థాయి నుంచి విద్యార్థుల‌కు నైపుణ్యాభివృద్ధి క‌ల్పిస్తే భ‌విష్య‌త్‌లో త‌మ‌కు ఇష్ట‌మైన రంగాల్లో రాణించే అవ‌కాశం ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

 

రాష్ట్రంలో ప‌ట్ట‌ణీక‌ర‌ణ వేగంగా సాగుతున్న నేప‌థ్యంలో విద్యాశాఖ మున్సిపల్ శాఖతో శాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాలన్నారు. హెచ్ఎండీఏ, మున్సిప‌ల్ లేఅవుట్ల‌లో సామాజిక వ‌స‌తుల కోసం గుర్తించిన స్థ‌లాల్లో పాఠ‌శాల‌లు ఏర్పాటు చేయాల‌న్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వివిధ విభాగాల కింద ఇంట‌ర్మీడియ‌ట్ వ‌ర‌కు ఉన్న వివిధ విద్యా సంస్థ‌ల‌ను హేతుబ‌ద్దీక‌రించి ప్ర‌తి పాఠ‌శాల‌ల్లో నిర్ధిష్ట సంఖ్య‌లో విద్యార్థులు ఉండేలా చూడాల‌ని ఆదేశించారు.

 

నాణ్య‌మైన భోజ‌నం, యూనిఫాంలు, పాఠ్యపుస్త‌కాలు అందిస్తుండ‌డంతో పెద్దసంఖ్య‌లో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నార‌ని తెలిపారు. డే స్కాల‌ర్స్‌‌కు పాఠ‌శాల‌ల్లో అన్నీ అందించే విష‌యంపై అధ్య‌య‌నం చేయాల‌ని సూచించారు. పిల్ల‌ల‌కు కుటుంబం, స‌మాజం ప్రాధాన్యాన్ని వివ‌రించాలన్నారు. కుటుంబం, సమాజం ప‌ట్ల వారి బాధ్య‌త‌ను తెలియ‌జేసేలా కౌన్సెలింగ్ ఇప్పిస్తే బాధ్య‌తాయుత‌మైన పౌరులుగా రాణిస్తార‌ని సీఎం అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి: