Published On:

Bhadrachalam: భద్రాచలంలో సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్

Bhadrachalam: భద్రాచలంలో సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్

CM Revanth Reddy to Attend Bhadrachalam Sri Sita Rama Kalyanam: భద్రాచలంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయమంతా రామనామస్మరణతో మార్మోగుతోంది. కాగా, సీతారాముల కల్యాణోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతతో కలిసి స్వామివారికి రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అలాగే టీటీడీ తరఫున ఛైర్మన్ బీఆర్ నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

 

ఇదిలా ఉండగా, ఆలయంలో పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఇప్పటికే మంత్రి కొండా సురేఖ, సీఎస్ శాంతికుమారి ఆలయం వద్దకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. భద్రాచలంలోని మిథిలా మండపంలో ఉదయం 10.30 నిమిషాలకు పూజలు ప్రారంభమవ్వగా.. మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు కొనసాగాయి.

 

అంతకుముందు, సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం 11 గంటలకు సారపాక బీపీఎల్ హెలీపాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, కలెక్టర్ జితేష్ పాటిల్, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి 11.05 నిమిషాలకు బయలుదేరి భద్రాచలంలోని సీతారాముల కల్యాణ వేడుకకు హాజరయ్యారు.