Telangana Cabinet: ప్రమాణస్వీకారానికి సిద్ధంగా ఉండండి.. ముగ్గురికి స్వయంగా ఫోన్ చేసిన సీఎం రేవంత్

CM Revanth Reddy Phone Call to new three ministers: రాష్ట్రంలో ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చింది. ఎంతోమంది ఆశావహుల ఉత్కంఠకు తెరపడింది. మంత్రి పదవులు దక్కే ముగ్గురి పేర్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు మంత్రులుగా ప్రమాణం చేయనున్న ముగ్గురికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్లకు స్వయంగా ఫోన్ చేసి ప్రమాణస్వీకారానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు.
కాగా, ఇవాళ మధ్యాహ్నం కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే రాజ్భవన్కు తెలంగాణ కొత్త మంత్రుల జాబితాను పంపించారు. ఈ జాబితాలో ముగ్గురు ఎమ్మెల్యేలు వివేక్, లక్ష్మణ్, వాకిటి శ్రీహరి పేర్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీ మాల సామాజికవర్గం కోటాలో వివేక్, ముదిరాజ్ కులానికి చెందిన వాకిటి శ్రీహరి మధ్యాహ్నం 12.15 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ మేరకు వాకిటి శ్రీహరి మక్తల్ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో సహా ఇతర నేతలకు రుణపడి ఉంటానన్నారు. బీసీలకు న్యాయం చేయాలని మొదటిసారి గెలిచిన నాకు కేబినెట్లో చోటు ఇవ్వడం గొప్ప వరంగా భావిస్తున్నట్లు చెప్పారు. జీవితాంతం విశ్వాసంగానే ఉంటానని ప్రకటించారు.