Nadendla Manohar on Ration Cards: కొత్త రేషన్కార్డుకు పెళ్లి సర్టిఫికెట్ అవసరం లేదు: మంత్రి నాదెండ్ల

Minister Nadendla Manohar’s key Statement on Ration Card: రేషన్కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. దరఖాస్తు స్వీకరించిన 21 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
95 శాతం ఈకేవైసీ..
ఏపీలో ఈ నెల 7వ తేదీ నుంచి రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేపట్టామని, రెండేళ్ల నుంచి వీటిని మార్చే అవకాశం రాలేదని తెలిపారు. రేషన్ కార్డుకు ఈకేవైసీ తప్పని సరి అని కేంద్రం స్పష్టం చేసిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కార్డును ఈకేవైసీ చేశామని వివరించారు. దేశంలోనే 95 శాతం ఈకేవైసీ పూర్తిచేసుకున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. 4,24,59,028 మందికి ఈకేవైసీ పూర్తయిందని, 22,59,498 మందికి మాత్రమే ఈకేవైసీ పూర్తికాలేదని తెలిపారు. సర్వర్ ఆపేసిన తర్వాత అనేక మంది అప్లికేషన్లు ఇస్తున్నారని చెప్పారు.
జరుగుతున్న ప్రచారం నమ్మొద్దు..
కొత్త రేషన్కార్డుకు పెళ్లి సర్టిఫికెట్ అవసరమంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి నాదెండ్ల స్పందించారు. పెళ్లి సర్టిఫికెట్, వివాహ కార్డు, మ్యారేజ్ ఫొటో అవసరం లేదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి పొరపాట్లు చేయొద్దని సూచించారు. రేషన్కార్డుకు ఎవరు దరఖాస్తు చేసినా స్వీకరించాలని ఆదేశించారు. ఏమైనా సందేహాలు ఉంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 4.24 కోట్ల మందికి జూన్లో ఉచితంగా రేషన్కార్డులు జారీ చేస్తామని తెలిపారు. పూర్తి సమాచారం తమ వద్ద ఉందని, అందులో ఎక్కడా లోపం లేదన్నారు.
క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రైస్కార్డు..
కూటమి ప్రభుత్వం సామాన్యుడికి అందుబాటులో ఉంటూ సాంకేతికతను ఉపయోగించుకుని ముందుకెళ్తోందని మంత్రి చెప్పారు. క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రైస్కార్డు ఇస్తామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. వయసుతో సంబంధం లేకుండా కుటుంబ సభ్యులు ఎవరైనా రేషన్కార్డులో యాడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. తొలగింపునకు మాత్రం మృతిచెందిన వారి పేర్లను ప్రస్తుతానికి పరిగణనలోకి తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. కార్డులో ‘హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ’ మార్చేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. నమోదైన తప్పుడు వివరాలను సరిచేసేందుకు జాయింట్ కలెక్టర్ వరకు వెళ్లకుండా తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించేందుకు వెసులుబాటు కల్పించామని నాదెండ్ల తెలిపారు.