Amaravati: రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు థ్యాంక్స్!

CM Chandrababu: ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పనులు పున: ప్రారంభమయ్యాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలకు, రాజధాని రైతులకు, కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులకు, కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన మీడియా, సోషల్ మీడియా వారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.
ప్రజల సహకారంతో, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో.. రాష్ట్రానికి చోదక శక్తిగా నిలిచేలా ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తామన్నారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధించి తమకు అండగా ఉన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరుపేరునా సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
పున :ప్రారంభ వేదికపై బీజేపీ శాసనసభ్యుడు సుజనా చౌదరి కనిపించడం చాలా మందిని విస్మయపరచింది. ఇందుకు సంబంధించి జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న సంగతి తెలిసిందే. కాగా ఈ పున :ప్రారంభ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, పెమ్మసారి చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. వీరితో పాటు సుజనా చౌదరి కూడా వేదికపై ఆసీనులయ్యారు. దీంతో రకరకాల రాజకీయ ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి.