AP EAPCET 2025: నేటి నుంచే ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు.. ఆలస్యమైతే నో ఎంట్రీ

AP EAPCET 2025 Exams Start Today onwards: ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జేఎన్టీయూకే ఆధ్వర్యంలో ఈ నెల 27 వరకు పరీక్షలు జరగనున్నట్లు సెట్ కన్వీనర్ వీవీ సుబ్బారావు చెప్పారు. మొత్తం 3,61,536 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఇందులో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల విద్యార్థుల కోసం ఏపీలో 143, హైదరాబాద్, సికింద్రాబాద్లలో రెండు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 27న అగ్రికల్చర్, ఫార్మసీ కీ, 28న ఇంజినీరింగ్ పరీక్షల కీ విడుదల చేస్తామన్నారు.
ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో 2,80,429 మంది దరఖాస్తు చేసుకోగా.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 81,832 మంది అప్లై చేశారు. నేడు, రేపు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగనుండగా.. 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ కోసం పరీక్షలు జరగుతాయి. ఈ పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. తొలి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. కావున పరీక్షకు గంట ముందే ఎగ్జామ్ సెంటర్ వద్దకు చేరుకోవాలని, ఆలస్యమైతే ప్రవేశం ఉండదని అధికారులు చెప్పారు.