Road Accident: పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

Punjab: పంజాబ్ రాష్ట్రంలో రహదారి నెత్తురోడింది. పటియాలా సిటీలో ఇవాళ సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. మరో విద్యార్థికి తీవ్రంగా గాయాలయ్యాయి.
పంజాబ్ రాష్ట్రంలోని పటియాలా సిటీలో ఏడుగురు స్కూల్ విద్యార్థులను పాఠశాల నుంచి ఇంటికి తీసుకువెళ్తున్న ఇన్నోవా కారు ఎదురుగా వస్తున్న టిప్పర్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు సహా కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందినట్టు పటియాలా జిల్లా ఎస్పీ పల్విందర్ సింగ్ చీమా వెల్లడించారు. ప్రమాదంలో ఇన్నోవా పూర్తిగా ధ్వంసమైంది. కాగా తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థిని స్థానికులు, పోలీసులు కలిసి ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సిటీలో ప్రమాదం జరగడంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
అయితే ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాలను ఆరా తీస్తున్నారు. దగ్గర్లోని సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించి మృతుల కుటుంబాలకు సమాచారమిచ్చారు.