Published On:

Operation Sindoor: క్షిపణులతో పాకిస్థాన్ దాడి, తిప్పికొట్టిన భారత్

Operation Sindoor: క్షిపణులతో పాకిస్థాన్ దాడి, తిప్పికొట్టిన భారత్

Operation Sindoor: జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న కీలక సైనిక స్థావరాలపై పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసేందుకు యత్నించగా, భారత భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని భారత రక్షణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించలేదని స్పష్టం చేసింది.

జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లలోని సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు యత్నించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. శత్రువుల నుంచి ముప్పును పసిగట్టిన వెంటనే, భారత సైన్యం నిర్దేశిత కార్యాచరణ నిబంధనలకు అనుగుణంగా ప్రతిస్పందించిందని, కైనెటిక్ , నాన్-కైనెటిక్ సామర్థ్యాలను ఉపయోగించి ఈ ముప్పులను తక్షణమే నిర్వీర్యం చేసినట్లు అధికారులు వివరించారు.

భద్రతా దళాల సత్వర ప్రతిచర్య వల్ల ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని, సైనిక ఆస్తులకు కూడా ఎటువంటి నష్టం కలగలేదని రక్షణ శాఖ తన ప్రకటనలో తెలిపింది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, ప్రజల భద్రతను నిర్ధారించడానికి భారతదేశం ఎల్లప్పుడూ పూర్తిగా సిద్ధంగా ఉంటుందని చెప్పింది.. సరిహద్దుల్లో ఎలాంటి దుందుడుకు చర్యలనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించిందని రక్షణ వర్గాలు వెల్లడించాయి.

అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు, అనుమానాస్పద కదలికలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు రక్షణ శాఖ తన ప్రకటన ద్వారా తెలియజేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.