Operation Sindoor: చిక్కిన పైలెట్, 3 పాక్ ఫైటర్ జెట్లు నేలమట్టం

Operation Sindoor: నిన్న రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను భారత్ పైకి ప్రయోగించింది పాకిస్థాన్. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపైకి వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతోపాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాలపాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది. పాక్ పైలట్ను భారత సైన్యం బందీగా పట్టుకుంది.
పాక్ దుస్సాహసంపై జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్ సమీక్షించారు. అనంతరం ఆయన పూర్తి వివరాలను ప్రధాని మోదీకి తెలిపారు. పాక్ దాడి తర్వాత- ఫైసలాబాద్, సర్గోదాల్లోని ఆ దేశ రక్షణ వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసింది. వాస్తవానికి మొన్న రాత్రి నుంచీ దాడులకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడిచేయడానికి 15 లక్ష్యాలను ఎంచుకుంది. దీన్ని ముందుగానే పసిగట్టిన భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ మానవ రహిత ఎయిర్క్రాఫ్ట్ వ్యవస్థతో విజయవంతంగా అడ్డుకుంది.
పాకిస్థాన్లోని పలు ప్రాంతాల్లోని గగనతల రక్షణకు సంబంధించిన రాడార్లను, వ్యవస్థలను భారత్ నిన్న ఉదయం ధ్వంసం చేసింది. పాక్ రాజధాని నగరం ఇస్లామాబాద్లో నిన్న సైరన్ల మోత మోగింది. అదే సమయంలో ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కార్యాలయంలో సమావేశం జరుగుతుండటం గమనార్హం.