Air India Crash : విమానం కూలగానే నేను కూర్చున్న సీటు ఊడిపడింది.. అందువల్లే బతికాను : మృత్యుంజయుడు విశ్వాస్
Vishwash Kumar Ramesh : అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో విశ్వాస్ కుమార్ రమేశ్ బయటపడ్డారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ప్రమాద క్షణాలను గుర్తుచేసుకున్నారు. విమానం కూలగానే తాను కూర్చున్న సీటు ఊడి పడిందని, అందువల్లే తాను బతికి బయటపడ్డానని చెప్పారు.
తాను విమానం నుంచి దూకలేదని పేర్కొన్నారు. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ముక్కలైందని తెలిపారు. తన సీటు విరిగిపోవడంతో దూరంగా ఎగిరిపడినట్లు చెప్పారు. అందుకే విమానంలో చెలరేగిన మంటలు తనకు అంటుకోలేదని వైద్యులకు తెలిపారు. ప్రమాదంలో ఆయన శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. గాయాల నుంచి కోలుకుంటున్న అతడు తాజాగా మీడియాతో మాట్లాడారు.
అంతా తన కళ్ల ముందే జరిగిందని వివరించారు. ఎలా బతికానో తకే అర్థం కాలేదన్నారు. విమానం కింద పడగానే తను కూడా చనిపోయానని అనుకున్నట్లు చెప్పారు. కళ్లు తెరిచి చూసేసరికి హాస్టల్ భవనం శిథిలాల్లో ఉన్నానని, శిథిలాల నుంచి నడుచుకుంటూ వెళ్లినట్లు పేర్కొన్నారు. మంటల ధాటికి తన ఎడమ చేయికి గాయమైందని తెలిపారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం రమేశ్ను ప్రధాని మోదీ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విశ్వాస్కు ఎలాంటి ప్రాణాపాయం లేదని ప్రధానికి వైద్యులు వివరించారు.
బ్రిటన్లో నివాసం ఉంటున్న విశ్వాస్ కుమార్ గుజరాత్లోని తన కుటుంబానికి కలిసేందుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన ఎయిర్ ఇండియా విమానంలోని 11-ఏ సీటులో విశ్వాస్ కుమార్ కూర్చున్నారు. ప్రమాదం అనంతరం రక్తపు మరకలతో నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్ ఎక్కారు. దృశ్యాలు వైరల్గా మారాయి. కాగా, గురువారం జరిగిన ప్రమాదంలో విమానంలోని 241 మంది మృతిచెందగా, విశ్వాస్ ఒక్కడే మృత్యుంజయుడిగా బయటపడ్డారు. ప్రమాదం వల్ల బీజే వైద్య కళాశాల వసతిగృహంలో మరో 24 మంది దుర్మరణం చెందారు.