Woman Cheated 25 People: నిత్య పెళ్లికూతురిని బురిడీ కొట్టించిన పోలీసులు.. 25 మందిని మోసగించి వివాహం!

Woman cheated 25 people in the name of Marriage: ఓ మహిళ వివాహాల పేరుతో 25మందిని మోసం చేసి పోలీసుకు చిక్కింది. అత్తగారి ఇంట్లో అమాయకురాలిగా నటించింది. ఈ క్రమంలోనే అత్తగారి ఆస్తులు, నగదుకు సంబంధించిన రహస్యాలు తెలుసుకొనేది. అందరి మెప్పు పొందిన తర్వాత తన గ్యాంగ్ సాయంతో నగదు, డబ్బుతో పరారు అయ్యేది. ఇప్పటి వరకు అనేకమంది జీవితాలతో ఆటలాడిన కిలాడీని రాజస్థాన్లోని మాధోపుర్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.
అమాయకులను మోసం చేసేందుకు గ్యాంగ్..
రాజస్థాన్కు చెందిన అనురాధ పాసవాన్ అనే మహిళ వివాహం పేరిట అమాయకులను మోసం చేస్తోంది. అమాయకులను బుట్టలో వేసుకునేందుకు ఓ గ్యాంగ్ను నడుపుతోంది. తాను ఒంటరి మహిళను అని చెప్పుకుంటూ నాటకాలు ఆడుతుండేది. తనకు ఉద్యోగం చేయని ఒక తమ్ముడు ఉన్నాడని, తాను పేదరాలినని, ఎవరి అండ లేకుండా జీవిస్తున్నానంటూ అందరినీ మభ్యపెట్టేది. తన గ్యాంగ్లోని ఓ వ్యక్తిని పెండ్లికి మధ్యవర్తిగా పంపుతూ సంబంధాలు కుదుర్చుకునేది. పేరు, ఊరు, కొత్త గుర్తింపు కార్డులతో వివాహాలు చేసుకునేది.
అమాయకురాలిగా నటిస్తూ..
వివాహం అనంతరం అత్తగారి ఇంట్లో ఏమీ తెలియని అమాయకురాలిగా నటిస్తూ అందరి మెప్పు పొందేది. ఈ క్రమంలో అత్తగారి ఇంట్లో నుంచి ఆస్తులు, నగదు, ఆభరణాల రహస్యాలు తెలుసుకునేది. అదును చూసి ఇంట్లో వారి ఆహారంలో మత్తు మందు కలిపి తినిపించేది. తన గ్యాంగ్ సభ్యులతో కలిసి వస్తువులు, నగదుతో పరారు అయ్యేది. ఇప్పటి వరకు 25 మందిని మోసం చేసింది. సదరు మహిళ బారినపడిన ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గతంలో అనేక మందిని అనురాధ మోసగించినట్లు తెలిసింది.
అరెస్టు చేసిన పోలీసులు..
సదరు మహిళ మైండ్ గేమ్ను మాధోపుర్ పోలీసులు తెలుసుకున్నారు. అదే తరహాలో అనురాధ పాసవాన్ను బురిడీ కొట్టించి ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఇటీవల అనురాధతో తనకు పెళ్లి జరిగిందని మధ్యప్రదేశ్కు చెందిన ఒక వ్యక్తి తెలిపారు. అప్పు చేసి మరీ వివాహం చేసుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. వారం రోజుల్లోనే ఆమె అసలు స్వరూపం బయటపడిందని వివరించారు. తన దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బు, మొబైల్ ఫోన్ జేసి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.