Technical Issue: వందేభారత్ లో సాంకేతిక లోపం.. నిలిచిన రైలు

Vande Bharat Express: ప్రయాణికుల్లో వందే భారత్ రైలుకు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తక్కువ సమయంలో ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చే ఈ రైలుకు మంచి మార్కులే పడుతున్నాయి. మేకిన్ ఇండియాలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో వివిధ మార్గాల్లో ఐదు వందేభారత్ రైళ్లను నడుపుతోంది.
అందులో భాగంగా సికింద్రాబాద్- తిరుపతి మధ్య రైల్వే అధికారులు వందే భారత్ రైలును ప్రవేశపెట్టారు. ప్రయాణికుల నుంచి ఈ రైలుకు మంచి డిమాండ్ వస్తోంది. అయితే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న వందే భారత్ రైలులో ఇవాళ సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో నెల్లూరు రైల్వేస్టేషన్ లో రైలును అత్యవసరంగా నిలిపివేశారు. అనంతరం రైల్వే సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. రైలు నిలిచిపోయి కోచ్ లలో ఏసీలు, ఫ్యాన్లు పని చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైలు అరగంటకు పైగా నెల్లూరు స్టేషన్ లో నిలిచిపోయింది. ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నాయని.. సమస్యను పరిష్కరించిన అనంతరం రైలు తిరుపతికి వెళ్తుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమకు సహకరించాలని కోరారు.