Last Updated:

Pawan Kalyan: కేంద్రంలో పవన్ ‘కీ’ రోల్.. ఏపీ డిప్యూటీ సీఎంపై ప్రధాని మోదీ ప్రశంసలు

Pawan Kalyan: కేంద్రంలో పవన్ ‘కీ’ రోల్.. ఏపీ డిప్యూటీ సీఎంపై ప్రధాని మోదీ ప్రశంసలు

PM Modi praises AP Deputy CM Pawan Kalyan: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో జనసేనాని పవన్ కల్యాణ్ కు అంచెలంచెలుగా మద్దతు పెరుగుతోంది. ఛండీఘర్ లో ఈరోజు జరిగిన కూటమి మిత్రపక్షాల సమావేశంలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మోదీ ఆయనపై ప్రశంసలు జల్లు కురిపించడమే దీనికి తార్కాణం. ప్రతిగా.. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, అభివృద్ధి మంత్రమే దేశాన్ని ముందుకు నడిపిస్తుందని జనసేన అధినేత కల్యాణ్‌ కితాబిచ్చారు. ఎన్డీఏ భాగస్వామాన్ని మరింత విస్తరిస్తామని, దేశాన్ని ప్రగతి పథం వైపు నడిపిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్‌ సింగ్‌ షైనీ ఈరోజు రెండో సారి ఛండీఘర్‌ లో ప్రమాణం స్వీకారం చేశారు. దీనికి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా హాజరయ్యారు. అనంతరం ఛండీఘర్‌ లో జరగనున్న ఎన్డీఏ మిత్రపక్షాల సీఎంలు, కీలక నేతల సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ సహా కేంద్రమంత్రులు హాజరయ్యారు. దాదాపు లక్ష మంది సమూహం మధ్య అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన జనసేనాని.. ఛండీఘర్‌ ఎయిర్‌ పోర్టులో మీడియాతో మాట్లాడారు. చరిత్రలో నిలిచేపోయే విధంగా హర్యానా ప్రజలు తీర్చునిచ్చారని తెలిపారు. వరుసగా మూడోసారి బీజేపీని ఆదరించడం అంటే.. ప్రజల్లో మోదీ ఛరిష్మాను నిరూపిస్తుందన్నారు. షైనీ – మోదీ నాయకత్వానికి ఇదే నిదర్శనమని ప్రశంసించారు. హర్యానా నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా మరింత ముందుకు సాగాలని సూచించారు.

జనసేనాని క్రేజ్‌…
హర్యానా సీఎం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఛండీఘర్‌ వెళ్లిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కు అక్కడి ఎయిర్‌ పోర్ట్‌ వద్ద ఘన స్వాగతం లభించింది. భారతీయ జనతా పార్టీ నాయకులు, కీలక నేతలు సాదరంగా ఆయనను ఆహ్వానించారు. పవన్‌ అభిమానులు సైతం ఆయనను చుట్టుముట్టారు. అనంతరం ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరై, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ
సందర్భంగా ప్రధాని మోదీ ఆయనతో ప్రత్యేకంగా సంభాషించారు. తిరుమలలో ఇటీవల చేపట్టిన వారాహి దీక్ష, చరిత్ర సృష్టిస్తున్న పల్లె పండుగ కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. అలాగే… వివిధ రాష్ట్రాలు, పార్టీలకు చెందిన నాయకులు పవన్‌ దగ్గరకు వచ్చి, ఆప్యాయంగా పలుకరిచడంతో పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్‌ లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ఎన్టీఏ కూటమిని మరింత బలోపేతం చేయడంతో పాటు సమష్టి నాయకత్వంలో పని చేయడంపై చర్చించారు.

బంధం.. బలోపేతం
దేశంలోని ఎన్డీఏ మిత్ర పక్షాల్లో ఆంధప్రదేశ్‌ చాలా ప్రత్యేకమనే చెప్పాలి. కేంద్రంలో 2019తో పోల్చితే… 2024లో బీజేపీకి మెజార్టీ తగ్గడంతో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. కూటమిగా ఏర్పడిన టీడీపీ-జనసేన-బీజేపీ.. 25 పార్లమెంటు స్థానాల్లో 21 కైవసం చేసుకోవడం… ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ దాటగలిగింది. దీంతో కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పై మోదీ – షా ద్వయానికి ఎంతో గురి కుదిరింది. దీంతో పవన్‌ బాధ్యతలు వహిస్తున్న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలకు ఇటీవల ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. పంచాయతీరాజ్‌ కు రూ.498 కోట్లు, ఉపాధిహామీ పథకం కింద రూ.4,500 కోట్లు కేటాయించారు. రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ ఒక్క ఉదాహరణ చెప్పవచ్చు. కేంద్రంలో పవన్‌ హవా ఏంటో తెలియజేయడానికి. తాజాగా.. హర్యానా సీఎం ప్రమాణ స్వీకారంలో పవన్‌ ప్రత్యేకాకర్షణగా నిలవడం, ఆయన చూపిన కూటమి ఫార్ములా బీజేపీ నేతలకు అమితంగా నచ్చడంతో జనసేనాని తన ప్రాభల్యాన్ని చాటుకుంటున్నారు.