Iran- Israel War: ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఇరాన్ కు గట్టి వార్నింగ్
Iran- Israel War Updates: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం భీకరంగా మారుతోంది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు సమాధానంగా ఇరాన్ కూడా ధీటుగా స్పందిస్తోంది. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇవాళ తెల్లవారుజామున ఇరాన్ లోని రక్షణ మంత్రిత్వశాఖ ప్రధాన కార్యాలయంతోపాటు ఎస్పీఎన్డీ అణు ప్రాజెక్టుపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేశాయి. అలాగే టెహ్రాన్ లోని అణ్వాయుధ స్థావరాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. అందులో ఇరాన్ కు సంబంధించిన అణు ఆర్కైవ్ ప్రదేశం కూడా ఉందని అధికారులు చెప్పారు. కాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో పలువురు కీలక అణు శాస్త్రవేత్తలు, అధికారులు, సైనిక ఉన్నతాధికారులు మరిణించినట్టు ఇరాన్ ప్రకటించింది.
చనిపోయిన వారిలో ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మొహమ్మద్ బాఘేరి, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ ఇన్ చీఫ్ హొస్సేన్ సలామీ, ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ మాజీ చీఫ్, అణు శాస్త్రవేత్త ఫరీడౌన్ అబ్బాసీ, ఇస్లామిక్ ఆజాద్ యూనివర్శిటీ ప్రెసిడెంట్, భౌతిక శాస్త్రవేత్త మొహమ్మద్ మెహదీ తెహ్రాంచీ, షాహిద్ బెహెష్టీ యూనివర్శిటీకి చెందిన అణుశాస్ర్తవేత్తలు, పలువురు కీలక అధికారులు చనిపోయారు.
కాగా ఇరాన్ లోని అణు కేంద్రాలు, సైనిక స్థావరాలు, చమురు ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో తాజాగా 29 మంది చిన్నారులు సహా 60 మంది మరణించారని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు చనిపోయినవారి సంఖ్య 78 కి చేరింది. అలాగే దాడుల్లో 320 మందికి పైగా గాయపడి చికిత్స పొందుతున్నారు. కాగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు ధీటుగా ఇరాన్ కూడా దాడులు చేస్తోంది. ఇరాన్ జరిపిన దాడుల్లో నలుగురు చనిపోయినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఇరాన్ జరుపుతున్న దాడులపై ఇజ్రాయెల్ స్పందించింది. ఇరాన్ తమపై ప్రతీకార దాడులు చేస్తే పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయని ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ హెచ్చరించారు.