TG CPGET 2025: విద్యార్థులకు అలర్ట్.. నేడే సీపీజీఈటీ నోటిఫికేషన్
Telangana: రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి గాను నిర్వహించే టీజీ సీపీజీఈటీ 2025 ఎంట్రెన్స్ పరీక్ష నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు టీజీ పీజీఈటీ 2025 సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, ప్రొఫెసర్ కుమార్ మొలుగరామ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. సీపీగెట్ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, వీరనారి చాకలి ఐలమ్మ, జేఎన్టీయూ పరిధిలోని యూనివర్శిటీ క్యాంపస్ లు, అనుబంధ కాలేజీల్లో అడ్మిషన్లు చేపట్టనున్నారు.
అలాగే డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ నోటిఫికేషన్ లో రెండో విడత సీట్ల కేటాయింపు ఇవాళ జరగనుంది. తొలివిడతలో 60,428 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. వీరిలో 41,285 మంది విద్యార్థులు కాలేజీల్లో చేరారు. రెండో విడత సీట్ల భర్తీ కోసం 33,409 మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు.