Last Updated:

Anurag Thakur: రెజ్లర్ల ఫిర్యాదులపై నిష్పక్షపాత దర్యాప్తు.. కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న రెజ్లర్లకు న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నట్లు కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు. అయితే, న్యాయ ప్రక్రియను అనుసరించి మాత్రమే అది సాధ్యమవుతుందన్నారు. నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని కేంద్రం కోరుకుంటోంది.

Anurag Thakur: రెజ్లర్ల ఫిర్యాదులపై నిష్పక్షపాత దర్యాప్తు.. కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

Anurag Thakur:భారత రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న రెజ్లర్లకు న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నట్లు కేంద్ర క్రీడలశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు. అయితే, న్యాయ ప్రక్రియను అనుసరించి మాత్రమే అది సాధ్యమవుతుందన్నారు. నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని కేంద్రం కోరుకుంటోంది. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నందున న్యాయ స్థానం తీర్పు కోసం ప్రభుత్వం ఎదరుచూస్తున్నామన్నారు. న్యాయప్రక్రియను అనుసరించే చర్యలు ఉంటాయి అని దిల్లీలో నిర్వహించిన ఓ మీడియా కార్యక్రమంలో అనురాగ్‌ ఠాకూర్ చెప్పారు.

పక్షపాత వైఖరికి తావులేదు..(Anurag Thakur)

రెజ్లర్ల ఆరోపణలపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికను సమర్పించిన తర్వాత ప్రస్తుతం ఈ కేసును ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఠాకూర్‌ తెలిపారు. ఈ కేసులో పక్షపాత వైఖరికి తావులేదని.. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగిన తర్వాత చర్యలకు వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు త్వరలోనే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి కావాలని కోరుకుంటున్నట్లు అనురాగ్‌ తెలిపారు.రెజ్లర్ల ప్రతి డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించిందని, అంతేకాకుండా బ్రిజ్‌భూషణ్‌పై మోపిన ఆరోపణలపై విచారణకు ఓ ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేసిందని అనురాగ్‌ ఠాకూర్‌ గుర్తు చేశారు. డబ్ల్యూఎఫ్‌ఐ వ్యవహారాలను నిర్వహించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని భారత ఒలింపిక్‌ సంఘాన్ని కోరినట్లు ఆయన వివరించారు. అథ్లెట్లయినా, సాధారణ మహిళలైనా వేధింపులు ఎదుర్కొంటే.. వీలైనంత త్వరగా న్యాయం జరగాలని ఆయన అన్నారు.

డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ తమను లైంగికంగా వేధించారంటూ.. ఒలింపిక్‌, వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించిన సాక్షిమాలిక్‌, వినేశ్‌ ఫొగాట్‌, భజరంగ్‌ పునియా, సంగీత ఫొగాట్ తదితర అంతర్జాతీయ స్థాయి రెజర్లు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వేదికలపై గెలిచిన పతకాలను గంగలో కలపడానికి కూడా వీరు సిద్దపడ్డారు. తాజాగా దిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌లో బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదయింది.