PM Modi Gujarati Tour: ఉగ్రవాదానికి సరైన రీతితో బదులిస్తాం: ప్రధాని మోదీ!

PM Modi at the 20th anniversary of Gujarat’s urban growth story: గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన గుజరాత్ అర్బన్ గ్రోత్ స్టోరీ 20వ సంబురాల్లో ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడారు. ఉగ్రవాదం పరోక్ష యుద్ధం కాదని, ఇది యుద్ధ వ్యూహాంగా మారిందని, పాక్ మనపై యుద్ధానికి దిగుతోందని ఆరోపించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 6 తర్వాత జరిగిన ఆపరేషన్లో మృతిచెందిన వారికి పాక్ ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టిందన్నారు. దీన్ని ప్రాక్సీ వార్గా గుర్తించలేమని ప్రధాని అన్నారు. ఉగ్రవాదుల మృతదేహాలపై పాక్ జాతీయ జెండాలను పరిచిందని, వాళ్లకు పాకిస్థాన్ మిలిటరీ సెల్యూట్ చేసిందని చెప్పారు. దీని ద్వారా ఉగ్రవాద చర్యలను పరోక్ష యుద్ధంగా పరిగణించరాదని, ఇది కావాలని చేస్తున్న యుద్ధ వ్యూహాంగా భావించాల్సి వస్తుందన్నారు. ఒకవేళ పాక్ యుద్ధానికి దిగిగే, అప్పుడు మన సమాధానం కూడా ఆ రేంజ్లో ఉంటుందని మోదీ తెలిపారు.
విభజన సమయంలోనే ముజాయిదీన్లు..
దేశ విభజన సమయంలోనే ముజాయిదీన్లు ఏర్పడ్డారని ప్రధాని తెలిపారు. వాళ్లను అప్పుడే ఖతం చేస్తే ఈ సమస్య ఉండేది కాదని పేర్కొన్నారు. కశ్మీర్లోకి ప్రవేశించిన ముజాయిదీన్లను 1947లో అంతం చేస్తే, ఇప్పుడు ఈ సమస్య ఉత్పన్నం అయ్యేది కాదని చెప్పారు. సింధూ నదీ జలాల విషయంలో కుదిరిన ఒప్పందంలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పారు. సరైన రీతిలో నదీ జలాల పంపకంపై చర్చలు జరగలేదన్నారు. కశ్మీర్లో ఉన్న డ్యామ్ల నుంచి ఇసుకను తీసివేసేందుకు అనుమతులు లేని విధంగా ఒప్పందం కుదర్చుకున్నట్లు ఆరోపించారు. సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసి, మన డ్యామ్ల్లో నీటి సామర్థ్యాన్ని పెంచుతుంటే, పాక్లు ఆగ్రహానికి గురవుతున్నారని తెలిపారు.
ఉగ్రవాదం అనే ముల్లును శాశ్వతంగా పీకేయాలి..
పాక్ ఆక్రమిత కశ్మీర్ను 1947లో సర్దార్ వల్లభాయ్ పటేల్ తమ ఆర్మీతో వెనక్కి తీసుకోవాలని భావించారని ప్రధాని తెలిపారు. 2014లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో భారత్ 11వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఉండేదన్నారు. కానీ, ఇప్పుడు నాలుగో అతిపెద్ద ఆర్థిక దేశంగా మారిందన్నారు. ఆర్థిక వ్యవస్థల్లో బ్రిటన్ను దాటేసినప్పుడు సంతోషంగా ఫీలయ్యామని చెప్పారు. ఆ దేశం మనల్ని పాలించిందని, ఎప్పుడు మూడో స్థానానికి వెళ్లాలన్న ఒత్తిడి ఇప్పుడు దేశంపై ఉందన్నారు. పొరుగు వాళ్లు కూడా సంతోషంగా ఉండాలన్న భావన ఉందన్నారు. కానీ మన సామర్థ్యాన్ని సవాల్ చేస్తే, అప్పుడు భారత్ హీరోలకు నిలయంగా మారుతుందని ప్రధాని తెలిపారు. మనకు నొప్పిని కలిగిస్తున్న ఉగ్రవాదం అనే ముల్లును శాశ్వతంగా పీకేయనున్నట్లు మోదీ తెలిపారు.