Road Accident : ఓఆర్ఆర్పై కంటైనర్ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు అక్కడికక్కడే మృతి

Road Accident : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం పరిధిలోని ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కంటైనర్ను వెనుక నుంచి వచ్చి కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు వెనుక సీట్లో కూర్చున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బీదర్ నుంచి హైదరాబాద్కు వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం క్షతగాత్రులను 108లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి తలకు బలమైన గాయం కాగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు నగరంలోని మేడిపల్లి, బోడుప్పల్కు చెందిన యశ్వంత్(25), చార్లెస్(25)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు, కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.