Earthquake in United Karimnagar District: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూకంపం.. భయంతో జనం పరుగులు

Telangana: తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూకంపం సంభవించింది. సాయంత్రం 6.30 గంటల సమయంలో కొన్ని సెకన్లపాటు భూమి స్వల్పంగా కంపించింది. ఇళ్లలోని వస్తువులు, కదలటం, పెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలిసినవారికి ఫోన్లు చేసి యోగక్షేమాలు ఆరా తీశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, సుల్తానాబాద్, కొడిమ్యాల, మాల్యాల, రాయికల్ ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. రెక్టర్ స్కేలుపై వీటి తీవ్రత 3.9 గా నమోదైంది. కాగా భూకంపం వచ్చిన విషయాన్ని అధికారులు ధృవీకరించారు. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని తెలిపారు. ప్రజలు భయపడవద్దని సూచించారు.