Published On:

America and Ukraine: ఎట్టకేలకు అమెరికా – ఉక్రెయిన్‌ మధ్య కుదిరిన మినరల్‌ డీల్‌.. యుద్ధం ముగిసినట్టేనా?

America and Ukraine: ఎట్టకేలకు అమెరికా – ఉక్రెయిన్‌ మధ్య కుదిరిన మినరల్‌ డీల్‌.. యుద్ధం ముగిసినట్టేనా?

America and Ukraine Key Agreement Minerals Deal: ఎట్టకేలకు అమెరికా – ఉక్రెయిన్‌ దేశాలకు మధ్య ఎట్టకేలకు కీలక ఒప్పందం మినరల్‌ డీల్‌ కుదిరింది. సుదీర్ఘకాలం పాటు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్న తర్వాత ఎట్టకేలకు అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌, ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ జెలెన్‌ స్కీలు సంతకాలు చేశారు. రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్‌కు 350 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఆయుధాలు డబ్బు సమకూర్చామని చెబుతోంది అమెరికా. దానికి బదులుగా తమకు ఉక్రెయిన్‌లోని విలువైన ఖనిజాలు రాసివ్వాలని పట్టుబట్టాడు ట్రంప్‌. ప్రారంభంలో కాస్తా బెట్టు చేసిన జెలెన్‌ స్కీ విధి లేని పరిస్థితిలో తన దేశంలోని అత్యంత విలువైన ఖనిజాలను అమెరికాకు ధారాదత్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

ఎట్టకేలకు అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ తన పంతాన్ని నెగ్గిచుకున్నాడు. ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ జెలెన్‌ స్కీని కాళ్లబేరానికి తెప్పించుకున్నాడు. నయానో బయానో ఉక్రెయిన్‌లో అత్యంత విలువైన ఖనిజాలను దక్కించుకున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే ఉక్రెయిన్‌లోని అత్యంత విలువైన ఖనిజాలతో పాటు విలువైన ప్రకృతి వనరులను కొల్లగొట్టాలని రష్యా ప్రెసిడెంట్‌ వ్లాదిమిర్‌ పుతిన్‌ కూడా ఉక్రెయిన్‌పై కన్నేశాడు. అయితే రష్యా పౌరులను ఉక్రెయిన్‌లో జెలెన్‌ స్కీ.. 2వ తరగతి పౌరులుగా చూస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో 2022 ఫిబ్రవరి 24వ తేదీన యుద్ధానికి దిగాడు. అప్పటి నుంచి ఆ యుద్ధం అలా కొనసాగుతూనే ఉంది. ఇక యుద్ధం మూడు నుంచి నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఇక రష్యాను అడ్డుకోవడానికి అప్పటి అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ ఉక్రెయిన్‌కు అండగా నిలిచాడు. ఉక్రెయిన్‌కు కావాల్సిన ఆయుధాలతో పాటు డబ్బు సమకూర్చాడు. అమెరికాతో పాటు యూరోప్‌ దేశాలు కూడా జెలెన్‌ స్కీకి అండగా నిలిచాయి. తమ వంతు ఆర్థిక సాయంతో పాటు ఆయుధాలు సమకూర్చింది కాబట్టి ఉక్రెయిన్‌ బలంగా నిలబడింది. ఈ యుద్ధం అలా కొనసాగుతూనే ఉంది.

 

అయితే అమెరికాలో గత ఏడాది నవంబర్‌లో జరిగిన ప్రెసిడెన్షియల్‌ పోల్‌లో ట్రంప్‌ ఘన విజయం సాధించిన తర్వాత నుంచి ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ జెలెన్‌ స్కీకి కష్టాలు మొదలయ్యాయి. రష్యా యుద్ధంలో ఉక్రెయిన్‌కు ఇచ్చిన ఆయుదాలు .. డబ్బు అంతా రుణమే. తీసుకున్న ఆయుధాలకు డబ్బు కట్టాల్సిందేనని.. తాము ఇచ్చిన 120 బిలియన్‌ డాలర్లకు గాను నాలుగు రెట్లు 500 బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సిందేనని ట్రంప్‌ జెలెన్‌ స్కీపై ఒత్తిడి తెచ్చాడు. వాస్తవానికి అమెరికా ఇచ్చింది 120 బిలియన్‌ డాలర్లే.. అయితే ట్రంప్‌ దాన్ని 350 బిలియన్‌ డాలర్లు ఇచ్చామని బుకాయించాడు. అంత డబ్బు తన వద్ద లేదు తాను చెల్లించలేనని జెలెన్‌ స్కీ చెప్పడం.. దానికి ట్రంప్‌ తాను ఆయుధాలు ఇవ్వలేనని బెట్టు చేయడం.. చక చకా జరిగిపోయాయి. ఒక వేళ అమెరికా ఆయుధాలు ఇవ్వకపోతే రష్యాతో ప్రమాదం పొంచి ఉంటుందని జెలన్‌ స్కీకి తెలుసు. దీంతో గత్యంతరం లేక ఉక్రెయిన్‌లోని మినరల్స్‌రాసి ఇవ్వడానికి అంగీకరించాడు. అయితే ఇక్కడ కూడా ఒక మెలిక పెట్టాడు ట్రంప్‌. ఉక్రెయిన్‌కు సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వలేనని చెప్పాడు. అంటే రష్యా దాడులు చేసినా తాను జోక్యం చేసుకోనని చెప్పడం ట్రంప్‌ ఉద్దేశం. అలాగే ఉక్రెయిన్‌ నాటో చేరడానికి వీల్లేదని షరతు విధించాడు.

 

ఇదిలా ఉండగా గత బుధవారం నాడు యూఎస్‌ ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెస్సెంట్‌, ఉక్రెయిన వైస్‌ ప్రైమినిస్టర్‌ యులియా స్వైరిడెంకో ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆ తర్వాత బెస్సెంట్‌ మాట్లాడుతూ రష్యాతో మాట్లాడి శాంతి చర్చలకు ట్రంప్‌ ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని చెప్పారు. ఒప్పందం ప్రకారం అమెరికా, ఉక్రెయిన్‌లు కలిసి రీఇన్వెస్ట్‌మెంట్‌ఫండ్‌ను ఏర్పాటు చేసుకుంటాయి. ఇరు దేశాలకు ఈక్విల్‌ పార్టనర్‌ షిప్‌ ఉంటుంది. కాగా ఫండ్‌ను ఇరు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. అయితే ఉక్రెయిన్‌కు మాత్రం దేశంలోని గనులు, సహజ వనరులపై సర్వహక్కులు ఉంటాయి. అలాగే ఖనిజాలను ఎక్కడ తవ్వితీయాలనేది కూడా ఉక్రెయిన్‌ సూచిస్తుంది. ఇక అమెరికా కొత్తగా ఏర్పాటు చేసిన ఫండ్‌కు నిధులు సర్దుబాటు చేస్తుంది. ఇక కీవ్‌ కూడా 50 శాతం రెవెన్యూను కొత్త ఫండ్‌కు సర్దుబాటు చేస్తుంది. అయితే ఉక్రెయిన్‌ ఈ నిధులను కీలకమైన చమురు సహజ వాయువు క్షేత్రాలను వేలానికి పెట్టి వచ్చిన డబ్బులో కొంత మొత్తం కొత్తగా ఏర్పాటు చేసిన ఫండ్‌కు సర్దుబాటు చేస్తుంది.

 

ఇక ఉక్రెయిన్‌ చెప్పేది ఏమిటంటే ఇప్పటి వరకు అమెరికా యుద్ధంలో ఇచ్చిన 350 బిలియన్‌ డాలర్లు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇక ఉక్రెయిన్‌లో అత్యంత విలువైన ఖనిజాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 34 అత్యంత విలువైన ఖనిజాలుంటే వాటిలో ఉక్రెయిన్‌లోనే 22 ఖనిజాలున్నట్లు ఆర్థికమంత్రిత్వశాఖ వెల్లడించింది. వాటిలో టిటానియం, జోర్కోనియం, గ్రాఫైట్‌, లిథియం ఉన్నట్లు తెలిపింది. వీటితో పాటు 17 మెటాలిక్‌ మినరల్స్‌ ఉన్నాయి. అవి లాంథానం, సీరియం, నియోడైమియంలని చెబుతున్నారు.. వీటిని హైటెక్‌ అప్లికేషన్స్‌ ఎలక్ర్టానిక్స్‌, డిఫెన్స్‌, ఎయిర్‌స్పెస్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీకి వాడతారు. ప్రపంచవ్యాప్తంగా నిల్వ ఉన్న అత్యంత విలువైన ఖనిజాల్లో ఉక్రెయిన్‌ వద్ద ఐదు శాతం ఉన్నట్లు చెబుతున్నారు. ఇక టైటానియం విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టైటానియంలో ఏడు శాతం ఉక్రెయిన్‌లోనే ఉంది. యూరోప్‌లో అత్యధికగా ఉక్రెయిన్‌లోని దాదాపు 5 లక్షల టన్నుల వరకు టైటానియం ఉన్నట్లు అంచనా.

 

అయితే ఈ డీల్‌ ఉక్రెయిన్‌కు లాభమా నష్టం అనే విషయానికి వస్తే ఉక్రెయిన్‌కు దౌత్యపరంగా విజయమే అని చెబుతున్నారు ఉక్రెయిన్‌కు చెందిన ఆర్థికవేత్తలు. ఎందుకంటే అమరికా సర్దుబాటు చేసిన 350 బిలియన్‌డాలర్లను ఉక్రెయిన్‌ చెల్లించాల్సిందే. ప్రస్తుతం ఆ డబ్బు చెల్లించాల్సిన పనిలేదు. అదీ కాకుండా ఉక్రెయిన్‌లో గనులపై హక్కులు మాత్రం పూర్తిగా ఉక్రెయిన్‌కే చెందుతాయి. అలాగే జాయింట్‌ వెంచర్‌ ఫండ్‌ద్వారా ఇరు దేశాలు కలిసి యుద్ధంలో ధ్వంసం అయిన నగరాలను భవిష్యత్తులో తిరిగి నిర్మిస్తాయి. కాగా ఈ ఫండ్‌కు ఉక్రెయిన్‌ కూడా కొంత డబ్బు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే ఉక్రెయిన్‌ సెక్యూరిటీకి మాత్రం అమెరికా గ్యారంటీ ఇవ్వడం లేదు. రష్యా దాడులను ఎదునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌.. తమ దేశానికి చెందిన సైనికులను మాత్రం ఉక్రెయిన్‌కు పంపే ప్రసక్తి లేదని స్పష్టం చేశాడు. అయితే ఉక్రెయిన్‌ ప్రయోజనాలను కాపాడుతామని ట్రంప్‌ హామీ ఇచ్చాడు.

 

ఇక ఉక్రెయిన్‌తో గనుల ఒప్పందం కుదరింది కాబట్టి అమెరికా రష్యాతో శాంతి చర్చలకు చొరవ తీసుకుంటుందని భావిస్తున్నారు. లేదంటే రష్యా పై మరోమారు కఠిన ఆంక్షలు విదించాలనే ఆలోచనలో ట్రంప్‌ అడ్మినిస్ర్టేషన్‌ ఉంది. ఇక చివరగా ఈ ఒప్పందం అమలు కావాలంటే ఉక్రెయిన్‌ పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే జెలెన్‌ స్కీ కేబినెట్‌ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఇక ఈ గనులను అభివృద్ది చేయడానికి అమెరికా ప్రభుత్వం నేరుగా డబ్బు సర్దుబాటుచేయదు. ప్రయివేట్‌ ఫండ్‌ల ద్వారా పెట్టుబడులు సేకరించి ఈ గనులను అభివృద్ది చేస్తుంది. ఉక్రెయిన్‌కు ఆర్థికపరంగా పెద్ద ప్రయోజనం లేకపోయినప్పటి దౌత్పపరంగా ఉక్రెయిన్‌ విజయం సాధించిందని ఉక్రెయిన్‌ ఆర్థికవేత్తలు మంత్రులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

 

ఇదిలా ఉండగా తాజా మినరల్‌ డీల్‌పై రష్యా ట్రంప్‌పై మండిపడింది. గురువారం నాడు ఒక ప్రకటనలో ట్రంప్‌పై వ్యంగ్యాస్ర్తాలు సంధించింది. రేపోమాపో ప్రపపంచ చిత్రపటం నుంచి మాయం అయ్యే దేశంలో ట్రంప్‌ మినరల్స్‌ ఒప్పందం కుదుర్చున్నాడంటూ ఎద్దేవా చేసింది. ట్రంప్‌ ఎట్టకేలకు యుద్ధం కోసం అమెరికా ఇచ్చిన డబ్బును ఇలా మినరల్స్‌ రూపంలో వసూలు చేసుకున్నాడని రష్యా సెక్యూరిటి కౌన్సాల్‌ డిపూటీ చైర్మన్‌ డిమిత్రి మెద్వెదేవ్ అన్నారు. రేపో మాపో కనుమరుగవుతున్న దేశానికి అమెరికా టాక్స్‌ పేయర్స్‌ డబ్బును ఇలా దుర్వినియోగం చేస్తున్నారని రష్యా ట్రంప్‌పై విరుచుకుపడింది. ఇక అసలు విషయానికి వస్తే ఉక్రెయిన్‌లోని ప్రకృతి వనరులను పుతిన్‌ కొల్లగొట్టాలనుకుంటే.. అది కాస్తా ట్రంప్‌ కొల్లగొట్టాడని రష్యా లోలోన మదనపడుతోంది. ఇక పుతిన్‌ ఉక్రెయిన్‌పై రెచ్చిపోయి దాడులు ఉధృతం చేస్తే ట్రంప్‌ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.