Published On:

Ex-Union minister Girija Vyas dies: అగ్ని ప్రమాదంలో మాజీ మంత్రి కన్నుమూత.. అసలేం జరిగిందంటే?

Ex-Union minister Girija Vyas dies: అగ్ని ప్రమాదంలో మాజీ మంత్రి కన్నుమూత.. అసలేం జరిగిందంటే?

Ex-Union minister Girija Vyas dies in Fire Accident: కేంద్ర మాజీ మంత్రి, రాజస్థాన్ కాంగ్రెస్ నేత గిరిజా వ్యాన్(79) కన్నుమూశారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన ఆమెను రాజస్థాన్‌లోని అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పరిస్థితి మరింత విషమించడంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయారు. ఆమె మృతికి కాంగ్రెస్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శితో పాటు కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు.

 

వివరాల ప్రకారం.. ఉదయపూర్‌లోని తన నివాసంలో మార్చి 31వ తేదీన మాజీ మంత్రి గిరిజా వ్యాస్ పూజలు చేస్తున్నారు. ఈ సమయంలోనే హారతి ఇస్తుండగా ఆమె దుప్పట్టాకు మంటలు అంటుకున్నాయి. ఈ మంటల్లో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం అహ్మదాబాద్‌లోని బైడస్ ఆస్పత్రికి తరలించారు.

 

గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. ఈ తరుణంలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక, ఆమె అంత్యక్రియలు ఉదయపూర్‌లో జరగనున్నట్లు చెప్పారు. ఆమె మృతిపై కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్, కేసీ వేణుగోపాల్ తదితరులు సంతాపం తెలిపారు.

 

ఇదిలా ఉండగా, 1946 జూలై 8 వ తేదీన జన్మించిన గిరిజా వ్యాస్.. తత్వశాస్త్రంలో డాక్టరేట్ తీసుకున్నారు. ఆ తర్వాత 1985లో ఆమె తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందింది. అప్పటినుంచి ఆమె రాజకీయాల్లో చురుకుగా పనిచేశారు. దీంతో 1991, 1996, 1999లలో ఉదయపూర్ లోక్ సభ నుంచి ఎంపీ నియామకమయ్యారు. కాగా, ప్రధానిగా పీవీ నరసింహరావు, మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలో గిరిజా వ్యాస్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా ఆమె రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్‌తో పాటు జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా విధులు నిర్వహించారు.