TG Phone Tapping Case: ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్న సిట్

TG Phone Tapping Case: సిట్ విచారణకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రభాకర్రావు ఉన్నారు. సుమారు 14 నెలల తర్వాత అమెరికా నుంచి నిన్న హైదరాబాద్కు చేరుకున్న ప్రభాకర్రావు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణకు హాజరయ్యారు. ప్రభాకర్రావు స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేస్తున్నారు. పంజాగుట్ట పోలీసుస్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఏ1గా ఉన్నారు.
ప్రభాకర్రావు నుంచి కీలక సమాచారం రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఫోన్ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రణీత్రావు, రాధాకిషన్రావు, భుజంగరావు, తిరుపతన్నను సిట్ అధికారులు అరెస్టు చేశారు. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్రావును ప్రశ్నించనున్నారు. ప్రభాకర్రావు ఈ కేసు నమోదైన సమయంలోనే అమెరికా వెళ్లారు. ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో పోలీసులు ఆయన పాస్పోర్టు రద్దు చేయించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సహకరించేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్తో హైదరాబాద్కు వచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం చెప్పాలనుకుంటున్నారు? అని ప్రశ్నించారని తెలుస్తోంది. కేసు నమోదైన వెంటనే విదేశాలకు ఎందుకు వెళ్లారు? అని అడిగారని సమాచాం. హార్డ్డిస్క్లను ఎవరు ధ్వంసం చేశారు?, మీ ఆదేశాలతోనే ప్రణీత్రావు హార్డ్డిస్క్లను ధ్వంసం చేశారా? అని సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. స్పెషల్ ఆపరేషన్ టీంను ఎవరు చెప్తే ఏర్పాటు చేశారు? అని సిట్ అధికారులు అడిగారని సమాచారం. హార్డ్డిస్క్ల ధ్వంసం వెనుక కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది? అని సిట్ అధికారులు స్పష్టం చేశారని తెలుస్తోంది. శ్రవణ్రావుకు, SIBతో సంబంధం ఏంటి? అని సిట్ అధికారులు నిలదీశారని తెలుస్తోంది.