Miss world contest: కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయండి.. సీఎం రేవంత్ ఆదేశం

CM Revanth Reddy: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా మరికొద్ది రోజుల్లో మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగబోతున్నాయి. దీంతో ఈవెంట్ ను ఘనంగా నిర్వహించేందుకుగాను సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
కాగా మే 7 నుంచి జూన్ 2 వరకు హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు దేశ, విదేశాల నుంచి ఎందో అందాల మగువలు, పలువురు ప్రముఖులు, అతిథులు ఇక్కడికి రానున్నారు. వీరంతా మే 5, 6 తేదీల్లోనే భాగ్యనగరానికి విచ్చేయనున్నారు. అసలైన ప్రధాన పోటీలు మే 10 న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభంకానున్నాయి. మే 12న బుద్ధభవన్ లో అందాల భామలతో ఆధ్యాత్మిక పర్యటన ఏర్పాటు చేశారు. మే 13న చౌమహల్లా ప్యాలస్ లో అతిథులకు, పోటీదారులకు ప్రభుత్వం తరపున విందు ఇవ్వాలని నిర్ణయించింది.
అయితే దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా అందాల పోటీలకు విచ్చేస్తున్న మగువలకు రక్షణగా ఎయిర్ పోర్టులు, వారు బసచేసే హోటళ్లు, అందాల పోటీలు జరిగే ప్రదేశంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. అలాగే కార్యక్రమాలు జరిగే తేదీలు, ప్రదేశాలు, చేస్తున్న ఏర్పాట్లను అధికారులు సీఎం రేవంత్ కు వివరించారు. మరోవైపు పోటీలు జరగనున్న నేపథ్యంలోనే భాగ్యనగరంలో రూ. 1.79 కోట్లతో పలు అభివృద్ధి పనులను చేపట్టింది. ప్రధాన రహదారులు, ముఖ్యమైన ప్రదేశాల్లో ఎల్ఈడీ లైట్లు, థీమ్ లైటింగ్, సెల్ఫీ పాయింట్లను ఏర్పాట్లు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు వివరించారు.
మరోవైపు పోటీలకు వచ్చిన వారికి రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, సంస్కృతి సంప్రదాయాలను వివరించాలని, అలాగే చార్మినార్, గోల్కొండ కోట, రామప్ప దేవాలయం, యాదగిరిగుట్ట, లక్నవరం సరస్సు వంటి ప్రదేశాలకు చూసేందుకు తగిన విధంగా ప్రణాళికలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా తెలంగాణలో ప్రఖ్యాతి చెందిన కళాఖండాలు, వస్త్రాలు, వంటకాలను అతిథులకు పరిచయం చేయాలని తెలిపారు. అందుకుగాను ఆయా విభాగాలకు ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. మరోవైపు పోటీలకోసం తెలంగాణ పర్యాటకశాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అతిథులకు మరిచిపోలేని మంచి అనుభూతిని కలిగించే విధంగా సన్నాహాలు చేపట్టింది.
మరోవైపు మిస్ వరల్డ్ పోటీలకు దాదాపు 120కి పైగా దేశాల నుంచి అందాల భామలు పోటీపడనున్నారు. కానీ ఒక్క దేశం పోటీలకు హాజరవుతుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్ దేశస్థులను భారత్ నుంచి వెళ్లిపోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో.. ఆ దేశానికి చెందిన అందాల భామలు పోటీలకు రాకపొవచ్చని తెలుస్తోంది.