Simhachalam: సింహాచలం ఘటనలో సిగ్గులేని చర్య! మృతుల ఒంటిపై బంగారం మాయం

Simhachalam: సింహాచలం గోడ కూలిన ఘటనలో మృతుల ఒంటిపై బంగారం మాయమైందని ఆరోపించారు బాధిత కుటుంబ సభ్యులు. టికెట్ క్యూలైన్లో గోడ కూలడంతో ఏడుగురు భక్తులు మృతి చెందారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు, శైలజ, పైలా వెంకటరత్నం, గుజ్జరి మహాలక్ష్మి ఉన్నారు.
ఉమామహేశ్వరరావు ఒంటిపై ఎప్పుడూ ధరించే మూడు తులాల బంగారు చైను, చేతి కడియం, ఉంగరం, వాచీ, శైలజ ఒంటిపై మంగళ సూత్రం , రెండు తులాలు చైను , నల్లపూసలు , చేతికి మూడు ఉంగరాలు, బ్రేస్లెట్ ఉన్నాయని ఉమామహేశ్వరరావు సోదరి చంద్రకళ చెబుతున్నారు.బాధితులు చెప్పేదానిబట్టి చూస్తే 12 తులాల బంగారం మాయమైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పలు అనుమానాలు వ్యక్తంమవుతున్నాయి.
ఘటనపై రెండవ రోజు దర్యాప్తు కొనసాగుతోంది. గోడకూలిన ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మరోమారు త్రిసభ్య కమిటీ సింహాచలంలో పర్యటించనుంది. త్రిసభ్య కమిటీ దర్యాప్తుతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
కొండపై అనంత్ అండ్ కో గుత్తేదారు లక్షణరావు మరిన్ని పనులు చేపట్టారు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన ప్రసాద్ స్కీమ్ నిధులను.. కాంట్రాక్టర్తో కలిసి ఈఈ శ్రీనివారాజు పక్కదారి పట్టించారు. దర్యాప్తులో అడుగడుగునా అవినీతి ఆనవాళ్ళు వెలుగులోకి వస్తున్నాయి. నాణ్యత లోపంతో క్యూ లైన్ గోడ కుప్పకూలిందని కమిటీ గుర్తించింది. రేపు సాయంత్రానికి సీఎంకు త్రిసభ్య కమిటీ పూర్తి నివేదికను ఇవ్వనుంది. గత కొంతకాలంగా దేవస్థానం కొండపై కాంట్రాక్టర్ లక్షణరావు పాతుకుపోయారు.