AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గిరిజన గురుకులాల్లో ఔట్సోర్సింగ్ బోధనా సిబ్బంది వేతనాల పెంపు

AP Government Decision: గిరిజన గురుకులాల్లో ఔట్సోర్సింగ్ బోధనా సిబ్బంది వేతనాలను పెంచుతూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. 1659 మంది వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కేటగిరీ (ఏ)లోని రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలను పెంచింది. జూనియర్ అధ్యాపకులు, పీడీ(సి), గ్రంథాయన్లు, పీజీటీల జీతాన్ని రూ.24,150, టీజీటీ పీడీ (ఎస్) జీతాలు రూ.19,350, పీఈటీ, ఆర్ట్, క్రాఫ్ట్ మ్యూజిక్ సిబ్బంది జీతం రూ.16,300కి పెంచింది.
కేటగిరీ (బీ)లోని పాఠశాలలు, కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్లో 40 మంది జూనియర్ లెక్చరర్లు, 18 మంది పీజీటీల వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పీజీటీల వేతనాలు రూ. 25వేల నుంచి రూ.31,250కి పెరిగాయి. అరకు వ్యాలీ బాలుర స్పోర్ట్స్ పాఠశాలలో కోచ్ వేతనాన్ని రూ.25వేల నుంచి రూ.31,250కి పెంచింది. అసిస్టెంట్ కోచ్ వేతనాలు రూ.22వేల నుంచి రూ.27,500కు పెంచింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.