Hydra: హైడ్రా ప్రజావాణికి అద్భుత స్పందన

Hydra : హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రజావాణిలో ప్రజల నుంచి 63 ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ స్వీకరించారు. లే ఔట్ రూపాన్ని మార్చవద్దని రంగనాథ్ సూచించారు. ఎవరికి వారు.. వారికి అనుగుణంగా లే ఔట్ రూపాన్ని మార్చేసి.. రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాజేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు.
ఏడు కాలనీలకు దారి చూపిన ఘనత హైడ్రాదని ఆయా కాలనీవాసులు కొనియాడారు. ఫిర్యాదు చేసిన వెంటనే సమస్యను పరిష్కరించారని ప్రజావాణి కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ని అభినందించారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రహదారి మూత పడింది. దీంతో అంబులెన్సులు, స్కూల్ బస్సులు రాలేని పరిస్థితుల్లో 20 ఏళ్లుగా అవస్థలు పడ్డామని కాలనీవాసులు వాపోయారు. ఇప్పుడు హైడ్రా చర్యలతో ఉపశమనం లభించిందని పేర్కొన్నారు.