Murder in Hyderabad: రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్, యువకుడి హత్య!

Murder in Hyderabad: గంజాయి మత్తులో ఓ యువకున్ని హత్య చేశారు దుండగులు. ఈ ఘటన హైదరాబాద్లోని కేపీహెచ్బీలో జరిగింది. ఆదివారం అర్ధరాత్రి గంజాయి మత్తులో ఉన్న కొందరు ఓ యువకుడిని హత్య చేశారు. సర్దార్ పటేల్ నగర్లోని ఓ అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న పార్క్లో ఐదుగురు యువకులు గంజాయి సేవిస్తూ న్యూసెన్స్ చేశారు. దీంతో దుండగులను వెంకటరమణ అనే యువకుడు నిలదీశాడు.
ఈ క్రమంలో పవన్ అనే యువకుడు ఇనుప కడ్డీని వెంకటరమణ గుండెల్లో గుచ్చాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు పవన్ పరారీలో ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ లో గంజాయి సేవించే వారు క్రమంగా పెరుగుతున్నారు. గంజాయి మత్తులో ఒళ్లు తెలియని స్థితిలో దారుణాలకు ఒడిగడుతున్నారు. హైదరాబాద్ లాంటి నగరంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుందని స్థానికులు వాపోతున్నారు. పోలసుల కళ్లుకప్పి గంజాయిని నగరానికి యదేశ్చగా చేరుతుందంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న గంజాయి బ్యాచ్ ల ఆగడాలను పోలీసులు నిలువరించాలని కోరుతున్నారు.