Theatre Bandh : తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్.. ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం

Theatre Bandh : రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన మూవీలు ప్రదర్శించలేకపోవడంతో జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే మూవీలు ప్రదర్శిస్తామని తేల్చి చెప్పారు. ఆదివారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. సమావేశంలో నిర్మాతలు దిల్రాజు, సురేశ్బాబుతోపాటు 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.
చాలాకాలంగా చర్చ..
ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య పర్సంటేజీపై చాలాకాలంగా చర్చ కొనసాగుతుంది. అద్దెల రూపంలో మూవీలను ప్రదర్శించడం సాధ్యంకాదని ఎగ్జిబిటర్లు అంటున్నారు. వారికి పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. దీంతో నిర్మాతలకు ఇబ్బందికరంగా మారింది. ఈ సందర్భంగా ఏర్పాటైన ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశంలో పర్సంటేజీ, ప్రభుత్వ విధానాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో నిర్మాతలకు లేఖ రాయాలని తీర్మానించారు.
గతంలో పర్సంటేజ్ విధానాన్ని మూడు భాగాలుగా విభజిస్తూ తెలంగాణ ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు.
-రూ.30 కోట్లు+ నైజాం హక్కులు కలిగిన సినిమాలకు మొదటి వారం 75శాతం డిస్ట్రిబ్యూటర్, 25శాతం ఎగ్జిబిటర్, రెండో వారం 55 శాతం డిస్ట్రిబ్యూటర్, 45 శాతం ఎగ్జిబిటర్, మూడో వారం 40 శాతం డిస్ట్రిబ్యూటర్, 60 శాతం ఎగ్జిబిటర్, నాలుగో వారం 30 శాతం డిస్ట్రిబ్యూటర్, 70 శాతం ఎగ్జిబిటర్.
-రూ.10 కోట్ల నుంచి 30 కోట్ల వరకు నైజాం హక్కులు కలిగిన మూవీలకు మొదటి వారం 60 శాతం డిస్ట్రిబ్యూటర్, 40 శాతం ఎగ్జిబిటర్, రెండో వారం 50 శాతం డిస్ట్రిబ్యూటర్, 50 శాతం ఎగ్జిబిటర్, మూడో వారం 40 శాతం డిస్ట్రిబ్యూటర్, 60 శాతం ఎగ్జిబిటర్, నాలుగో వారం 30 శాతం డిస్ట్రిబ్యూటర్, 70 శాతం ఎగ్జిబిటర్
-రూ.10 కోట్ల లోపు నైజాం హక్కులు కలిగిన మూవీలకు మొదటి వారం 50 శాతం డిస్ట్రిబ్యూటర్, 50 శాతం ఎగ్జిబిటర్, రెండో వారం 40 శాతం డిస్ట్రిబ్యూటర్, 60 శాతం ఎగ్జిబిటర్, మూడో వారం 30 శాతం డిస్ట్రిబ్యూటర్, 70 శాతం ఎగ్జిబిటర్కి ఉండేది.
పెద్ద, మీడియం సినిమాలకు 2 శాతం నేగోషియేషన్తో.. అంటే 73 శాతం డిస్ట్రిబ్యూటర్, 27 శాతం ఎగ్జిబిటర్ తీసుకునేలా నిర్ణయం తీసుకున్నారు.