Konda Surekha: యూ టర్న్.. నా మాటలను వక్రీకరించారు: కొండా సురేఖ

Konda Surekha: తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఇతర మంత్రుల్లా తాను డబ్బులు తీసుకుని పనిచేయనన్న కొండా సురేఖ వ్యాఖ్యలపై వివాదం రేగింది. ఆవిడ అన్న మాటలు కాంగ్రెస్ నాయకుల గురించికాదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని ఆమె మండిపడ్డారు. తాను మాట్లాడిన మాటల్లో కాంగ్రెస్ మంత్రులు అని ఎక్కడా చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ ఈ రకమైన ప్రచారం చేస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వంలో మంత్రులు పర్సంటేజ్లు తీసుకున్నారని ఆరోపించారు. తనపై దుష్ర్పచారం ఆపకపోతే సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేస్తామని కొండా సురేఖ హెచ్చరించారు.
అసలు కొండా సురేఖ ఏమన్నారంటే… ఇతర మంత్రుల లాగా ఫైల్ క్లియర్ చేసేందుకు తాను డబ్బులు తీసుకోనని అన్నారు. తన దగ్గరికి ఫైల్స్ క్లియరెన్స్ కోసం వచ్చినా.. ఏమీ ఆశించకుండా పని చేస్తున్నట్లు చెప్పారు. అరవిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు కోట్లతో నూతన కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
అరవింద ఫార్మా వారు పనుల కోసం తన వద్దకు వచ్చినప్పుడు, ఇతర మంత్రులలాగా తనకు కమిషన్ ఇవ్వనవసరం లేదని.. తనకు ఇచ్చే డబ్బులతో ప్రభుత్వ కళాశాల భవనం నిర్మించాలని సూచించినట్లు తెలిపానని చెప్పారు. అరవిందో ఫార్మా వారికే భవన నిర్మాణ పనులు అప్పగించామని.. ప్రభుత్వం తరఫున నిర్మిస్తే క్వాలిటీ తోపాటు నిర్మాణం ఆలస్యం అవుతుందన్నారు. ప్రస్తుతం కొండా సురేఖ దేవాదాయ శాఖ అటవీ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు.
సురేఖ మాటలపై కేటీఆర్ కామెంట్
కొండాసురేఖ మాట్లాడిన మాలు నిజమేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ కమిషన్ సర్కార్ నడుపుతోందన్నారు. ఈ విషయం బహిరంగ రహస్యంగా మారడం దురదృష్టకరమని తెలిపారు. నిజాలు మాట్లాడినందుకు మంత్రి కొండా సురేఖకు అభినందనలు అంటూ.. కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ.. క్యాబినెట్ మంత్రులపై విచారణకు ఆదేశించగలరా? అని పోస్ట్ చేశారు.