Last Updated:

Zia Khan suicide case: జియాఖాన్‌ ఆత్మహత్య కేసులో నటుడు సూరజ్‌ పంచోలీ నిర్దోషి..సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు

బాలీవుడ్ యువకథానాయిక జియా ఖాన్ కేసులో నటుడు సూరజ్ పంచోలికి ఊరట దక్కింది. సరైన సాక్ష్యాలు లేనందున ఈ కేసునుంచి సూరజ్ పంచోలికి విముక్తి కల్పిస్తున్నట్లు ముంబై సిబిఐ ప్రత్యేక కోర్టు ప్రకటించింది. 2013లో దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది.

Zia Khan  suicide case: జియాఖాన్‌ ఆత్మహత్య కేసులో నటుడు సూరజ్‌ పంచోలీ నిర్దోషి..సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు

Zia Khan suicide case: బాలీవుడ్ యువకథానాయిక జియా ఖాన్ కేసులో నటుడు సూరజ్ పంచోలికి ఊరట దక్కింది. సరైన సాక్ష్యాలు లేనందున ఈ కేసునుంచి సూరజ్ పంచోలికి విముక్తి కల్పిస్తున్నట్లు ముంబై సిబిఐ ప్రత్యేక కోర్టు ప్రకటించింది. 2013లో దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది. మొదట ఈ కేసుని ఆత్మహత్యగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ జారీ చేశారు. కానీ సూసైడ్ నోట్, జియా ఖాన్ తల్లి చేసిన పోరాటం కారణంగా ఈ కేసుని సిబిఐకి అప్పగించారు. సిబిఐ దర్యాప్తు, కోర్టు విచారణ జరిగిన తరువాత పది సంవత్సరాలకి ఈ కేసులో తుది తీర్పు వచ్చింది.

నఫీసా రిజ్వీ ఖాన్ గా జన్మించిన జియా ఖాన్ బాలీవుడ్‌లో 2010 దశకంలో వర్ధమాన తారగా రాణించింది. అమితాబ్ బచ్చన్ – అక్షయ్ కుమార్ -అమీర్ ఖాన్ వంటి పెద్ద స్టార్ లతో కలిసి పనిచేసింది. 25 ఏళ్ళ జియాఖాన్ 2013 జూన్ 3న ముంబైలోని జుహూలో తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది. జియా ముంబైలోని తన అపార్ట్ మెంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ చేశారు.

శారీరకంగా, మానసికంగా వేధించాడు..(Zia Khan suicide case)

జియా ఖాన్‌తో వర్థమాన నటుడు సూరజ్ పంచోలి ప్రేమ వ్యవహారం నడిపాడు. ఆత్మహత్యకి ముందు జియాఖాన్ సూసైడ్ నోట్ కూడా రాసింది. ప్రేమ పేరుతో సూరజ్ పంచోలి తనని మానసికంగా, శారీరకంగా వేధించాడని జియా ఈ లేఖలో ఆరోపించింది. పలుమార్లు అబార్షన్లు కూడా చేయించుకున్నానని జియా ఖాన్ లేఖలో వెల్లడించింది. జియాఖాన్ తల్లి రబియా తన కూతురి ఆత్మహత్యకు ఆమె ప్రియుడు సూరజ్ పంచోలీ కారణమని ఆరోపించారు. డేటింగ్లో ఉన్నప్పుడు సూరజ్ తన కుమార్తెను శారీరకంగాను.. మాటలతో వేధించాడని జియా తల్లి ఆరోపించింది. ఇది ఆమెను డిప్రెషన్ లోకి నెట్టిందని చెప్పారు. ఆ తర్వాత ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాలు సూరజ్ పంచోలిపై నమోదు చేశారు. అరెస్ట్ చేశారు.

హత్యకాదు ఆతహత్యే..

21రోజులపాటు జైల్లో ఉన్న సూరజ్ పంచోలి బెయిల్‌పై విడుదలయ్యారు. 2014లో సిబిఐ దర్యాప్తు పూర్తి చేసి హత్య కోణాన్ని తోసిపుచ్చింది. ఆత్మహత్య చేసుకుందని ధృవీకరించారు. అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అయితే జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. జియా శరీరంపై ఉన్న గాయాలు సిబిఐ నివేదికకి భిన్నంగా ఉన్నాయని రబియా ఖాన్ తెలిపారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఉరి వేసి ఉంటారన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత సిబిఐ కోర్టు న్యాయమూర్తి సయ్యద్ ఈ కేసు తీర్పుని రిజర్వ్ చేశారు. నటుడు సూరజ్ పంచోలిని నేడు నిర్దోషిగా ప్రకటించారు.