Published On:

TN NEET Row Update: స్టాలిన్‌ ప్రభుత్వానికి బిగ్ షాక్.. నీట్ బిల్ రిజెక్ట్ చేసిన రాష్ట్రపతి ముర్ముర్

TN NEET Row Update: స్టాలిన్‌ ప్రభుత్వానికి బిగ్ షాక్.. నీట్ బిల్ రిజెక్ట్ చేసిన రాష్ట్రపతి ముర్ముర్

Tamil Nadu NEET Row Bill Rejected by the president Draupadi Murmu: స్టాలిన్ సర్కారుకు బిగ్‌షాక్ తగిలింది. నీట్‌ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని కొన్నేళ్లుగా ఆ రాష్ట్రం డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం, డీఎంకే సర్కారు మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంకే స్టాలిన్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు పంపిన నీట్‌ వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌ శాసనసభలో వెల్లడించారు.

 

కేంద్రం తిరస్కరణ..
నీట్ పరీక్ష అంశంపై తమిళనాడు ప్రభుత్వం అన్ని వివరణలు ఇచ్చిందని స్టాలిన్ తెలిపారు. అయినప్పటికీ నీట్‌ నుంచి రాష్ట్రాన్ని మినహాయించేందుకు కేంద్రం తిరస్కరిస్తోందని మండిపడ్డారు. దీని దక్షిణాది రాష్ట్రాన్ని అవమానించడమే అన్నారు. కేంద్రం మన అభ్యర్థనను తిరస్కరించొచ్చు కానీ, మన పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేసేందుకు న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తామని చెప్పారు. న్యాయ నిపుణులను సంప్రదిస్తామని స్టాలిన్‌ అసెంబ్లీలో తెలిపారు. దీనిపై సమగ్రంగా చర్చించేందుకు ఈ నెల 9న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.

 

తమిళనాడులో విద్యార్థుల ఆత్మహత్యలు..
నీట్ పరీక్ష కారణంగా తమిళనాడులో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని తమిళనాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్ష నీట్ పరిధి నుంచి రాష్ట్రాన్ని శాశ్వతంగా మినహాయించాలని ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. దీని ప్రకారం 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు వైద్య, విద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు. బిల్లును ఇప్పటికే 2021, 2022లో రెండుసార్లు అసెంబ్లీ ఆమోదించింది. అనంతరం గవర్నర్‌కు పంపగా, పలుమార్లు తిరస్కరణకు గురైంది. దీంతో బిల్లులో కొన్ని మార్పులు చేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు.

డీలిమిటేషన్‌పై వివాదం..
ఇప్పటికే హిందీ వివాదం, డీలిమిటేషన్ వంటి అంశాలపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా నీట్‌ బిల్లును తిరస్కరించడంతో ఇది మరింత ముదిరేలా కన్పిస్తోంది. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి: