Director Rajamouli at RTA Office: ఖైరతాబాద్లో రాజమౌళి సందడి – ఆర్టీఏ ఆఫీసుకు జక్కన్న.. ఎందుకో తెలుసా..?

SS Rajamouli Visit Khairatabad RTA Office in Hyderabad: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఖైరతాబాద్లో సందడి చేశారు. అక్కడి ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన ఆ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకునేందుకు ఆయన ఖైరతాబాద్ రవాణా కార్యాలయానికి వచ్చినట్టు తెలుస్తోంది. విదేశాల్లో షూటింగ్ నేపథ్యంలో జక్కన్న ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. తన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్లో కోసం రాజమౌళి సంతకం చేసి ఫోటో దిగారు. అనంతరం ఆయనకు అధికారులు డ్రైవింగ్ లైసెన్స్ను అందజేశారు.
ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ భారీ ప్రాజెక్ట్కు వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ29(SSMB29) అనే వర్కింగ్ టైటిల్తో పాన్ వరల్డ్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీ లాంచింగ్ నుంచి షూటింగ్ వరకు ప్రతి విషయంలోనూ మూవీ టీం చాలా గొప్యత పాటిస్తోంది. కనీస అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు. గుట్టుచప్పుడు కాకుండ ఈ మూవీ షూటింగ్ని ముందుకు తీసుకువెళుతున్నాడు జక్కన్న. ఇటీవల ఒడిసాలో ఈ మూవీ షూటింగ్ను జరుపుకుంటుంది. అక్కడ మహేష్, ప్రథ్వీరాజ్ సుకుమారన్ మధ్య చీత్రికరించిన కీలక సన్నివేశాం సోషల్ మీడియాలో లీకైన సంగతి తెలిసిందే.
అయితే కాసేపటికికే సోషల్ మీడియాలో నుంచి ఆ వీడియోను తొలగించారు. దీంతో సెట్లో భద్రత, నిబంధనలు మరింత కఠినం చేశాడు జక్కన్న. ప్రతి ఒక్కరికి ఫుల్ చెక్ చేసిన తర్వాతే సెట్లోకి పంపిస్తున్నారు. మరోసారి మూవీకి సంబంధించిన ఎలాంటి లీక్స్ లేకుండ మరింత జాగ్రత్త పడుతోంది టీం. పాన్ వరల్డ్ తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు విదేశాల్లోనే ఉండనుందని సమాచారం. ఇందులో భాగంగా జక్కన్న తన ఇంటర్నేషనల్ లైసెన్స్ రెన్యువల్ కోసం గురువారం ఆర్టీఏ ఆఫీసుకు వచ్చినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహిత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.