Last Updated:

Jio Fiber: ఎయిర్ టెల్ ఓర్వలేకపోతోంది.. ట్రాయ్ కు జియో లేఖ

ఐపీఎల్ ప్రసారం హక్కులను జియో తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జియో టీవీలో ఐపీఎల్ ప్రసారాన్ని ఉద్దేశించి ఎయిర్ టెల్ ఈ ఫిర్యాదు చేసింది.

Jio Fiber: ఎయిర్ టెల్ ఓర్వలేకపోతోంది.. ట్రాయ్ కు జియో లేఖ

Jio Fiber: జియో ఫైబర్ ద్వారా లైవ్ టీవీ ప్రసారాలను అందించడంపై జియోపై.. ఎయిర్ టెల్ ట్రాయ్ కు ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదుపై జియో మండిపడింది. జియో ఫైబర్ ద్వారా తక్కువ ధరల్లో సేవలను అందించడాన్ని ప్రత్యర్థి కంపెనీ అయిన ఎయిన్ టెల్ ఓర్వలేకపోతోందని తెలిపింది. తన ప్రయోజనాల కోసం జియోపై బురద చల్లుతోందని మండిపడింది. భవిష్యత్ ఎయిర్ టెల్ ఇలాంటి ఫిర్యాదులు చేయకుండా హెచ్చరించాలని ట్రాయ్ ను కోరింది జియో.

ఫిర్యాదు దేనికంటే..(Jio Fiber)

ఐపీఎల్ ప్రసారం హక్కులను జియో తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జియో టీవీలో ఐపీఎల్ ప్రసారాన్ని ఉద్దేశించి ఎయిర్ టెల్ ఈ ఫిర్యాదు చేసింది. రిలయన్స్ జియో బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్ తో లైవ్ టీవీ ప్రసారాలను జియో అందిస్తోందంటూ ఎయిర్ టెల్ మార్చి 31న ఈ ఫిర్యాదు ఇచ్చింది. అన్ రిజిస్టర్ డిజిటల్ పంపిణీ ప్లాట్ ఫామ్స్ ద్వారా బ్రాడ్ కాస్టింగ్ కంటెంట్ ను అందించడం వల్ల ప్రసార కర్తలు డౌన్ లింకింగ్ విధానాన్ని పట్టించుకోవడంలేదని తన కంప్లైంట్ లో పేర్కొంది. ఈ ఫిర్యాదుపై ట్రాయ్ .. జియోను వివరణ కోరింది. ఈ అంశంపై జియో తన సమాధానాన్ని ట్రాయ్ కు తెలిపింది. అందుకు సంబంధించిన లేఖ తాజాగా బయటకొచ్చింది.

తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎయిర్ టెల్ ఇలాంటి ఫిర్యాదులు ఇచ్చిందని జియో.. ట్రాయ్ కు రాసిన లేఖలో తెలిపింది. జియో ఫైబర్ అతి తక్కువ ధరల్లో సేవలను అందించడంపై ఎయిర్ టెల్ ఓర్వలేకపోతోందని పేర్కొంది. సొంత ప్రయోజనాల కోసం ఇచ్చిన ఇలాంటి ఫిర్యాదులను పట్టించుకోవద్దని జియో కోరింది.

 

ఆ ఫిర్యాదును తిరస్కరించండి

జేపీఎల్‌ అనేది ఓ అగ్రిగేటరని.. జియో టీవీ ప్లస్‌ పేరుతో ఓటీటీ యాప్స్‌ను ఇది అందిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. జియో టీవీ ప్లస్‌ యాప్‌లో ఓటీటీతో సహా ఇతర ఛానెళ్ల ప్రసారాలు కూడా లభిస్తాయని తెలిపింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌, జీ5, సోనీ లివ్‌ లాంటి ఓటీటీ యాప్స్‌ కూడా టీవీ ఛానెళ్ల డిజిటల్‌ ఫీడ్‌ను అందిస్తున్నాయని.. జియో ఫైబర్‌ సేవలు తీసుకుని ఓటీటీ యాప్స్‌కు సబ్‌స్క్రైబ్‌ చేసుకునే వినియోగదారులు.. ఓటీటీ సేవలతో పాటు ఛానెళ్లు సైతం పొందుతారని తెలిపింది. ఎయిర్‌టెల్‌ కూడా అదే పనిచేస్తోందని పేర్కొంది. ఎయిర్‌టెల్‌ చేసిన ఫిర్యాదులో ఎలాంటి ఆధారాలూ లేవని జియో వెల్లడించింది. కాబట్టి ఆ ఫిర్యాదును తిరస్కరించాలని ట్రాయ్‌ను కోరింది జియో.