Published On:

Kaleshwaram : మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితే రాద్ధాంతం చేస్తున్నారు : కాళేశ్వరం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు

Kaleshwaram : మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితే రాద్ధాంతం చేస్తున్నారు : కాళేశ్వరం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు

Former Minister Harish Rao : మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కూలినట్లు కాంగ్రెస్‌ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం కాళేశ్వరంపై ఆయన తెలంగాణ భవన్‌లో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని వివరించారు. కాళేశ్వరానికి మహారాష్ట్ర అభ్యంతరం చెప్పకుండా చర్చలు జరిపామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన 45 రోజులకు మహారాష్ట్రకు వెళ్లి ఆ ప్రభుత్వంతో చర్చించి ఒప్పించామని చెప్పారు.

 

కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మూడు బ్యారేజీలు..
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు అన్నారు. 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వలు, 98 కిలోమీటర్ల ప్రెజర్‌ మెయిన్స్‌, 141 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు నీటి ఎత్తిపోతలు అని వివరించారు. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీరు ఎత్తిపోసేలా రూపకల్పన చేశారని, తమ్మిడిహట్టి వద్ద నీళ్లు తక్కువ ఉంటాయని ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చామని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీని ఏడు బ్లాకులుగా 85 పియర్లుగా నిర్మించారని, కాళేశ్వరం లేకుండా పంటలు పండాయని కాంగ్రెస్‌ చెబుతోందన్నారు. ప్రాజెక్టు వల్ల యాసంగిలో పంటలు పండాయన్నారు. ప్రాజెక్టుకు మూడు వనరుల ద్వారా నీటి లభ్యత ఉందన్నారు. ఆ నీటితో వేలాది చెరువులు నింపవచ్చన్నారు. మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్‌ వరకు నిర్మించినవన్నీ వాడకంలోనే ఉన్నాయని, కాళేశ్వరం కింద కాల్వ ద్వారా 90 వేల ఎకరాలకు నీరు అందించొచ్చు అన్నారు.

 

ప్రాణహిత-చేవెళ్లకు కాంగ్రెస్ అనుమతులు సాధించలేదు..
తెలంగాణ విభజన సమయంలో రాష్ట్రానికి గోదావరి జలాల్లో 940 టీఎంసీలు కేటాయించారని తెలిపారు. తెలంగాణ గోదావరి జలాలను ఏనాడు 400 టీఎంసీలకు మించి వాడుకోలేదన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం నాలుగేళ్లలో అనుమతులు కూడా సాధించలేదని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించకుండా కాల్వల తవ్వకం పనులు చేపట్టారని పేర్కొన్నారు. 2007లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వ్యయాన్ని రూ.17వేల కోట్లుగా చెప్పారని, ప్రాజెక్టు ప్రారంభించకముందే 2011నాటికి అంచనా వ్యయాన్ని రూ.40 వేల కోట్లకు పెంచారన్నారు.

ఇవి కూడా చదవండి: